
ఓ వైపు డిజిటల్ యువగంలో దేశం దూసుకుపోతున్నా.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం కనీస రోడ్డు మార్గాలు లేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమాయాల్లో హాస్పిటల్కు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి గటనే అల్లూరి జిల్లాలో వెలుగు చూసింది. అనంతగిరి మండలం, పినకోట పంచాయతీ పరిధిలోని పందిరిమామిడి గ్రామానికి చెందిన భీమరాజు అనే గిరిజనుడు గత కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు.
అయితే, ఆ గ్రామానికి సరైన రోడ్డు వసతి లేకపోవడంతో ఎలాంటి వాహనాలు గానీ, 108 అంబులెన్స్ గానీ గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో చేసేదేమీ లేక స్థానికులు ఓ కర్రకు దుప్పటి కట్టి ‘డోలీ’ని సిద్ధం చేశారు. అనారోగ్యంతో ఉన్న భీమరాజును అందులో పడుకోబెట్టి, కొండలు, గుట్టల మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల దూరం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బొర్రపాలెం వరకు మోసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్ సహాయంతో భీమరాజును పినకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘ దూరం డోలీలో ప్రయాణించడం, ఎండ తీవ్రత కారణంగా ఆసుపత్రికి చేరేసరికి భీమరాజు పూర్తిగా నీరసించిపోయాడు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ మారుమూల గ్రామాల నుంచి రోగులను, గర్భిణీలను డోలీల్లో మోసుకురావడం తీవ్ర ఇబ్బందిగా మారుతుందని.. ఈ కారణంగా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానిక గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాణాలు గాల్లో దీపాల్లా మారకముందే ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పందిరిమామిడి గ్రామానికి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని, మన్యం గుండెల్లో రవాణా భయాన్ని పోగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.