Andhra Pradesh: ఏపీలో లిక్కర్ టెండర్ల కిక్కు.. లక్కీ డ్రాలో షాపుల కేటాయింపు పూర్తి

|

Oct 14, 2024 | 6:37 PM

ఏపీలో లిక్కర్ టెండర్లు ప్రభుత్వానికి కిక్ ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా షాపుల కేటాయింపు ప్రక్రియ సందడిగా సాగింది. లక్కీ డ్రాలో టెండర్లు దక్కించుకున్న వాళ్లు మంచి కిక్కులో ఉన్నారు. ఇంతకీ కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది?

Andhra Pradesh: ఏపీలో లిక్కర్ టెండర్ల కిక్కు.. లక్కీ డ్రాలో షాపుల కేటాయింపు పూర్తి
Andhra Liquor Shops
Follow us on

ఏపీలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ జాతరలా జరిగింది. దరఖాస్తుదారుల సమక్షంలో.. సీసీ కెమెరాల నిఘాలో.. లక్కీ డ్రా తీశారు అధికారులు. షాపుల వారీగా వచ్చిన దరఖాస్తులకు నెంబర్లు కేటాయించి.. అందరి సమక్షంలో లక్కీ డిప్ తీశారు. షాపులు దక్కించుకున్న వారికి అధికారులు లైసెన్స్‌లు ఇచ్చారు. షాపుల దక్కించుకున్న వారిచేత అప్పటికప్పుడే లైసెన్స్ ఫీజును వసూలు చేశారు అధికారులు. అక్కడే క్యాష్ కౌంటింగ్ మెషీన్లతో లెక్కించి.. ఖజానాలో డిపాజిట్ చేశారు. ఈ నెల 16 నుంచి.. అంటే వచ్చే బుధవారం నుంచే ఏపీలో కొత్త లిక్కర్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3వేల 396 మద్యం దుకాణాలకు 89వేల 882 దరఖాస్తులు వచ్చాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 17వందల 97 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇక లైసెన్స్ ఫీజుల రూపంలోనూ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది.

ఈ సారి మద్యం టెండర్లలో మహిళలు, విద్యావంతులు కూడా లిక్కర్ టెండర్లలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖలో జరిగిన లాటరీ ప్రక్రియలో మద్యం దుకాణాలను దక్కించుకున్న మహిళలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జాక్‌పాట్‌ కొట్టినట్లు మురిసిపోయారు.  మచిలీపట్నం లాటరీలో 2 షాపులు ఇతర రాష్ట్రాల వారికి దక్కాయి. 1వ నెంబర్ దుకాణం.. కర్నాటకకు చెందిన మహేష్‌కు.. 2వ నెంబర్‌ దుకాణం.. యూపీ వాసి లోకేష్‌చంద్‌కు తగిలింది. అనంతపురం జిల్లాలో ఓ బీజేపీ నేతకు ఏకంగా ఐదు షాపులు తగిలడంతో ఆయన పంట పండింది. తాడిపత్రిలో 12 మద్యం దుకాణాల్లో.. జేసీ వర్గానికి 10 షాపులు వచ్చాయి. మరోవైపు మద్యం షాపుల దరఖాస్తుదారులకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన వార్నింగ్‌ హాట్ టాపిక్‌గా మారింది. తాడిపత్రి అభివృద్ధి కోసం 15 పైసలు షేర్‌ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

26 జిల్లాల్లోనూ మద్యం షాపులకు వేలం విజయవంతంగా పూర్తి అయిందని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా షాపుల కేటాయింపు ప్రక్రియ చేపట్టామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పక్క రాష్ట్రాల బ్రాండ్లను కూడా ప్రమోట్‌ చేస్తామని.. రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే భారీగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి చెప్పారు.

అయితే మద్యం టెండర్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేల హవా నడిచిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ల అనుచరులకే మద్యం షాపులు వచ్చాయనీ.. చాలా చోట్ల సిండికేట్ అయ్యారనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..