
మార్కాపురం, జనవరి 25: శుక్రవారం రాత్రి కనిగిరి నుంచి వెదురుకర్రల లోడుతో గిద్దలూరుకు వెళ్తున్న బొలేరో వాహనం రిపేర్ వచ్చింది. డ్రైవర్ పీరయ్య బొలేరోను రోడ్డు పక్కన నిలిపి వాహనం లోపల నిద్రపోతున్నాడు. అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వాసవి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళుతుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్ను కూడా ఢీకొంది. కొనకనమిట్ల మండల పరిధిలోని చిన్నారికట్ల గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న బొలేరో వాహనం ముందు భాగంలోకి బస్సు చొచ్చుకుపోయాయి.
అనంతరం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో 60 మంది ప్రయాణికులున్నారు. ఘటనలో రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ పొట్టలోకి వెదురు కర్రలు చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్ధన్రెడ్డి (54) గా గుర్తించారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొనకనమిట్ల పోలీసులు కనిగిరి ఆస్పత్రికి తరలించారు. జనార్ధన్రెడ్డి మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.