
‘నా పన్నెండేళ్ల తమ్ముడు నెల రోజులు ఉపవాసాలు చేశాడు. దర్గాకు పెళ్ళి కార్డుతో బయలుదేరాం. రోడ్డుపై టిఫిన్ కోసం ఆగి నిమిషంలో మళ్ళీ బయలుదేరిపోదామనుకున్నాం. ఇంతలో మృత్యుశకటంలా దూసుకువచ్చింది బస్సు. బస్సు చక్రాల కింద నలిగిపోతున్న తమ్ముడ్ని రక్షించాలని ఆ ఆక్క ప్రాధేయపడింది. అన్నయ్యా కాపాడండి అని వేడుకున్నా. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. బస్సులో ఇంజనీరింగ్ విద్యార్థులున్నారు. ఒక్కరూ చలించలేదు. డ్రైవర్ కూడా కిందకు దిగలేదు. తల్లిదండ్రులు, చెల్లి, తమ్ముడు బస్సుకింద కు వెళ్లారు. అప్పటికే తమ్ముడు చూస్తుండగానే కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయాడు.’ అంటూ పెళ్లి కూతురు బోరున విలపించిన తీరు అందరిని కలచి వేసింది. ఈ హృదయవిదారకర ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అనకాపల్లి జిల్లా పెందుర్తి ద్రోణంరాజు నగర్కు చెందిన ఓ కుటుంబం ఇంట్లో శుభకార్యానికి అంతా సిద్ధమవుతున్నారు. అంతలోనే మాటలకందని తీరని విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడింది. తండ్రి షేక్ రెహమాన్, తల్లి షేక్ మున్నీ బేగమ్, సోదరి షేక్ జరీనా బేగమ్, తమ్ముడు షేక్ గౌస్ మొహిద్దీన్, పెళ్లికూతురు వాజిదా బేగం.. పెందుర్తికి చెందిన కారు డ్రైవర్ అహ్మద్, సయ్యద్ బాబ్జీతో కలిసి బయలుదేరారు. రంజాన్ సందర్భంగా నెలరోజుల పాటు భక్తితో ఉపవాసలు.. ఆ తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా పండుగ.. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో వివాహం.. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. అతిథులు, బంధుమిత్రులకు వాటిని పంచే ముందు తమకు నమ్మకమైన దర్గాల సందర్శనకు బయలుదేరాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి కారులో పిఠాపురం బయలుదేరారు. మధ్యలో అనకాపల్లి జిల్లా బయ్యవరం దర్గాను దర్శించుకున్నారు.
రోడ్డుపై మొబైల్ టిఫిన్ వాహనం దగ్గర కారు ఆపి.. అంతా టిఫిన్ చేశారు. ఒకటి రెండు నిమిషాల్లో అక్కడ నుంచి మళ్ళీ కారులో బయలుదేరాల్సి ఉంది. ఇంతలో ఓ కాలేజీ బస్సు మృత్యుశకటంగా మారింది. రయ్యిన దూసుకు వచ్చింది. బైకులు వాహనాలను ఢీకొడుతూ బీభత్సం సృష్టించింది. అక్కడే ఉన్న ఆ కుటుంబం పైకి వెళ్ళింది. దీంతో అంతా బస్సు కింద పడ్డారు. పక్కనే మరికొంత మంది పైనా వెళ్లింది ఆ బస్సు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. అవంతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి అతివేగంగా వచ్చింది. మూడు టూ వీలర్లు, కారు, టిఫిన్ సెంటర్ వ్యాన్పైకి దూసుకొచ్చింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తెరుకునేలోపే అంతా జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో పెళ్లి కూతురు తమ్ముడు గౌస్ మొహిద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. గౌస్ మొహిద్దీన్ తండ్రి షేక్ రెహమాన్, తల్లి షేక్ షరీఫున్నిసా మున్నీ బేగమ్, సోదరి షేక్ జరీనా, కారు డ్రైవర్ అహ్మద్, సయ్యద్ బాబ్జీ, టిఫిన్ సెంటర్ రమణమ్మ, బయ్యవరానికి చెందిన గొన్నాబత్తుల లక్ష్మి, అనిల్కుమార్, లక్ష్మణరావు, ఎస్. రామకృష్ణ లు గాయాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
‘పెళ్లి కార్డు పట్టుకుని దర్గాలకు బయలుదేరాం. బయ్యావరం దర్గా దర్శించుకుని పిఠాపురం వెళ్ళేందుకు బయలుదేరాం. టిఫిన్ చేద్దామని రోడ్డు పక్కనే ఆగాం. ఇంతలో బస్సు వచ్చి డీకోట్టింది. నా పన్నెండేళ్ల తమ్ముడు నెల రోజులు ఉపవాసం చేశాడు. టైర్ కింద ఉన్న తమ్ముడిని రక్షించాలని ప్రాధేయపడ్డాను. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మరో నలుగురు బస్సు కిందకు వెళ్లారు. నా తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు.’ అంటూ పెళ్లి కూతురు వాజీదా ఆవేదన అందరిని కలచి వేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..