ఎస్ఈసీ ఈవాచ్ యాప్పై రగులతున్న వివాదం.. ముమ్మాటికి నిమ్మగడ్డ పర్సనల్ యాప్ అంటున్న వైసీపీ నేతలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు అటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య అగ్గి రాజేశాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు, వైసీపీ ప్రభుత్వానికి మధ్య అగ్గి రాజేశాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మొదలైన రచ్చ SEC క్రియేట్ చేసిన యాప్ వరకు చేరింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలు, పార్టీల ప్రలోభాలు..ఇలాంటివి ఏవైనా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు రావాలన్న ఆలోచనతో ఎస్ఈసీ కొత్త మొబైల్ యాప్ని రూపొందించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రత్యేక యాప్ని ఆవిష్కరించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీలో పంచాయితీ ఎన్నికలపై ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించామని SEC చెబుతోంది. అయితే ఇది ముమ్మాటికి నిమ్మగడ్డ వ్యక్తిగత యాప్ అంటోంది అధికార పార్టీ వైసీపీ. ఇప్పటికే అందుబాటులో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక యాప్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం యాప్ అందుబాటులో ఉండగా…కొత్తగా యాప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిన యాప్ ను నిపుణులతో పరీక్షించయినా వాడుకోవాలని, లేదా కేంద్ర ఎన్నికల సంఘం యాప్ లనైనా వాడాలని సజ్జల సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన డేటాను కాదని, నిమ్మగడ్డ సొంతగా యాప్ తయారుచేసుకోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే వైసీపీ తరఫున అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సజ్జల ఆరోపించారు. అవసరమైతే ఈవిషయంలో కోర్టుకు వెళ్ళాలని కూడా భావిస్తున్నట్లుగా చెప్పారు.
ఎస్ఈసీ తయారు చేసిన యాప్ టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందని అనుమానిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ యాప్లో తమ ఫిర్యాదులు ఫిల్టర్ అయ్యే విధంగా డిజైన్ చేసి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై ఎస్ఈసీ రియాక్షన్ ఎలా ఉండబోతుందనే అంశం ఆసక్తిగా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :