
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ 2026 జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, మిలటరీ డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని జేడీ వాన్స్ తెలిపారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండగా, సెకండ్ లేడీ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
వాన్స్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. జేడీ వాన్స్, ఉషా దంపతుల మొదటి సంతానం ఇవాన్(పెద్ద కుమారుడు). ఇతను 2017లో జన్మించాడు. ప్రస్తుతం ఇవాన్ వయసు సుమారు 8 ఏళ్లు. మీడియా హడావిడికి దూరంగా సాధారణ కుర్రాడిలా పెరుగుతున్నాడు. రెండో కుమారుడి పేరు వివేక్. ఇతనికి తెలుగు పేరు పెట్టడం విశేషం. వివేక్ 2020 ఫిబ్రవరిలో పుట్టాడు. ప్రస్తుతం అతని వయసు 6 ఏళ్లు. గతంలో జేడీ వాన్స్, వివేక్ పుట్టినరోజు నాడు సెనేట్లో డాక్టర్ సీస్ (Dr. Seuss) పుస్తకం చదివి వినిపించడం వైరల్ అయ్యింది. ఇక మూడో సంతానంగా వాన్స్ దంపతులకు కూతురు పుట్టింది. ఆమెకు మిరాబెల్ అని పేరు పెట్టారు. ఈ పాప 2021 డిసెంబర్లో జన్మించింది.
మిరాబెల్ వయసు ఇప్పుడు సుమారు 4 ఏళ్లు.
రెండు కుమారుడికి వివేక్ అని పేరు పెట్టడం వెనుక కారణం ఉంది. అదేంటంటే.. ఉషా వాన్స్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. పిల్లల పెంపకంలో మన సంప్రదాయాలు, విలువలు కూడా నేర్పిస్తున్నారట. ఎన్ని పనులున్నా, పిల్లలతో గడపడానికే వాన్స్ దంపతులు ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ఇప్పుడు రాబోయే నాలుగో చిన్నారితో ఆ ఇల్లు మరింత సందడిగా మారనుంది. అయితే పిల్లలు తనకు బరువు కాదని, బాధ్యత అని జెడీ వాన్స్ ప్రకటించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి