ఇరాన్ టార్గెట్‌గా అమెరికా గ్లోబల్ షాక్! గల్ఫ్‌ దేశాలకు ట్రంప్ కొత్త షరతు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై ఇరాన్ నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పూర్తి దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం మోసపూరితమైనదని, హింసాత్మక, దురుద్దేశపూరితం వల్లే పూర్తి వినాశన మార్గంలోకి వెళ్తోందని ట్రంప్ విమర్శించారు.

ఇరాన్ టార్గెట్‌గా అమెరికా గ్లోబల్ షాక్! గల్ఫ్‌ దేశాలకు ట్రంప్ కొత్త షరతు..!
Trump On Gulf States

Updated on: Jul 14, 2026 | 10:25 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై ఇరాన్ నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పూర్తి దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం మోసపూరితమైనదని, హింసాత్మక, దురుద్దేశపూరితం వల్లే పూర్తి వినాశన మార్గంలోకి వెళ్తోందని ట్రంప్ విమర్శించారు. ఈ కారణంగానే, ఇరాన్ మినహా మిగిలిన అన్ని దేశాల నౌకలకు హోర్ముజ్ జలసంధి తెరిచి ఉంటుందన్నారు. కేవలం ఇరాన్ ఓడరేవులకు రాకపోకలు సాగించే, ఇరాన్ సరుకులను రవాణా చేసే నౌకలపై మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుతం ఇరాన్ పాలకుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో అమెరికా సైనిక పటిష్టతను కొనియాడారు. “అమెరికా సైన్యం అపారమైన శక్తి కారణంగానే ప్రస్తుతం చమురు మునుపెన్నడూ లేనంత వేగంగా ప్రవహిస్తోంది” అని పేర్కొంటూ, రక్షణ రంగానికి చెందిన కీలక వ్యక్తులు యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్, యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ట్రంప్ తన ‘ట్రూత్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత అస్థిరమైన ఈ ప్రాంతాన్ని రక్షించే ఖర్చులను భరించడానికి అన్ని సరుకు రవాణా నౌకలపై 20 శాతం పన్ను విధిస్తామన్నారు. ఇకపై అమెరికాను ‘హార్ముజ్ జలసంధి సంరక్షకుడు’ అని పిలుస్తారని ప్రకటించారు. అయితే తాజాగా ఆ ప్రతిపాదనలో ఆయన కీలక మార్పులు చేశారు. మధ్యప్రాచ్య నాయకులతో జరిపిన చర్చల అనంతరం, 20% పన్నుకు బదులుగా గల్ఫ్ దేశాలు అమెరికాతో భారీ వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కొత్త పెట్టుబడుల వల్ల చారిత్రాత్మకంగా కర్మాగారాలు, ప్లాంట్లు, పరికరాలు అమెరికాకు తరలివస్తాయని, దీని ద్వారా లక్షలాది మంది అమెరికన్లకు మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు లభిస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

చివరగా ఇరాన్ అణ్వాయుధాలపై ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 52,000 మంది నిరసనకారులతో సహా లక్షలాది మందిని ఇరాన్ నిర్దాక్షిణ్యంగా చంపిన రోజులు ఇక ముగిశాయని, అమెరికా మళ్ళీ అపూర్వమైన విజయాలను సాధిస్తోందని అన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా “ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు!” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యూహాత్మక మార్పులు మధ్యప్రాచ్యంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us