PM Modi: ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం.. ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

ఇటలీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమైన మోదీ.. AI, క్వాంటమ్ టెక్నాలజీ, IMEC కారిడార్ సహా పలు కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2029 నాటికి ఇటలీ కంపెనీలు భారత్‌లో 20 బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

PM Modi: ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం.. ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
PM Modi and Giorgia Meloni

Updated on: May 20, 2026 | 8:08 PM

ఇటలీ పర్యటనలో పలు కీలక ఒప్పందాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతకాలు చేశారు. ఇటలీ ప్రధాని మెలోనితో చర్చలు సక్సెస్‌ అయ్యాయని అన్నారు. 2029 వరకు ఇటలీ కంపెనీలు భారత్‌లో 20 బిలియన్‌ యూరోల పెట్టుబడులు పెడుతాయని తెలిపారు. AI, క్వాంటమ్‌ రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. ఇటలీ ప్రధాని మెలోనిని భారత్‌కు రావాలని ఆహ్వానించారు మోదీ. భారత్‌లో 800 ఇటలీ కంపెనీలు ఉన్నాయన్నారు మోదీ. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడ్డాయని అన్నారు. డిజైన్లకు ఇటలీ పుట్టినిల్లని అన్నారు. నైపుణ్యత విషయంలో భారత్‌తో పాటు ఇటలీ కూడా టాప్‌లో ఉందన్నారు. యోగాకు ఇటలీలో ఎంతో ఆదరణ ఉందన్నారు మోదీ. భారత్‌-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇరుదేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతి సమస్యకు చర్చల తోనే పరిష్కారం లభిస్తుందని ఉక్రెయిన్‌-రష్యాన్ని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. టెర్రర్‌ ఫండింగ్‌తో ప్రపంచశాంతికి ముప్పు పొంచి ఉందన్నారు.

ఐమెక్ (IMEC) కారిడార్‌పై ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.. IMEC కారిడార్ అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ ద్వారా అనుసంధానమే లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పశ్చిమ ఆసియా, యూరప్ యుద్ధాలపై చర్చించిన నేతలు.. శాంతి దిశగా చర్చలే మార్గమని స్పష్టీకరించారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో పరస్పర సహకారంపై ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోని ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. భారత్-యూరోపియన్ యూనియన్ సంబంధాల బలోపేతంపై ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి.. యుద్ధాల పరిష్కారానికి దౌత్యమే ఏకైక మార్గమని.. ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా.. అంతకుముందు భారత ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఘనంగా స్వాగతం పలికారు. ఇటలీ బృందంతో కలిసి ప్రధాని మోదీ డిన్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఆ తర్వాత చారిత్రక కొలోసియంలో మోదీ-మెలోనీ కలియదిరిగారు. ఇటలీ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ స్టేడియం గురించి మోదీకి మెలోని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె సెల్ఫీ దిగారు. వెల్‌కమ్‌ టు రోమ్‌, మై ఫ్రెండ్‌ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us