
ప్రధాని మోదీ అతి త్వరలో చైనాలో పర్యటించనున్నారా? చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చలు జరపనున్నారా? అంటే జాతీయ మీడియా కథనాలు అవుననే అంటున్నాయి. గతంలో లద్దాఖ్ సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో రెండు దేశాల మధ్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో త్వరలో భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆగస్టులో జరిగే ఎస్సీఓ సదస్సుకు ప్రధాని హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 31-సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ హైలెవల్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సహా ఇతర దేశాధినేతలు పాల్గోనబోతున్నట్లు తెలుస్తోంది. బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది అక్టోబరులో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ, షీ జిన్పింగ్ ముఖాముఖీగా సమావేశమయ్యారు. 2020 తర్వాత నుంచి చైనాలో ప్రధాని మోదీ పర్యటించబోతుండటం మళ్లీ ఇప్పుడే. ప్రధాని మోదీ 2015లో తొలిసారిగా బీజింగ్కు వెళ్లారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఆ దేశంలో పర్యటించారు.
అయితే, ఐదేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో ఇరుదేశాల మధ్య సైనికుల ఘర్షణ జరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటించి జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాల గురించి వీరివురూ చర్చించారు. ఎస్సీవో సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్ను పర్యాటకంగా దెబ్బతీసి, మతపరమైన విభజన తెచ్చేందుకే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారని.. పాక్, చైనా మంత్రుల సమక్షంలోనే తెలిపారు.