
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే టార్గెట్ గా విరుచుకుపడింది. పీఓకే, పాకిస్తాన్లోని పలు ఉగ్ర స్థావరాలు, కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపులపై భారత యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి.
ఆపరేషన్ సిందూర్ లో పీఓకే, పాకిస్తాన్లోని పలు ఉగ్ర స్థావరాలు, కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపులపై భారత యుద్ధవిమానాలు దాడులు చేసి ధ్వంసం చేసాయి. వీటిలో బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ‘మార్కజ్ సుభాన్ అల్లా’ కాంప్లెక్స్ ను తీవ్రంగా దెబ్బతీయడం హైలైట్ అయింది. 2025 మే 7న జరిగిన ఈ దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు చెందిన బంధువులు కూడా మరణించారు. దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఈ జైష్ స్థావరం ఇప్పుడు మళ్లీ కార్యకలాపాలకు సిద్ధమై కొత్త రూపు సంతరించుకుంది.
ఆపరేషన్ సిందూర్ దాడులు జరిగి 15 నెలలు కూడా పూర్తికాకముందే తీవ్రంగా దెబ్బతిన్న ‘మార్కజ్ సుభాన్ అల్లా’ భవనాన్ని ప్రభుత్వ నిధులతో పాకిస్తాన్ పునర్నిర్మించింది. 15 నెలల్లోనే పునర్నిర్మించి మళ్లీ ఉగ్రకలాపాలకు భవనం సిద్ధం చేసింది. జైషే కార్యాలయం మరమ్మత్తులకు పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా 25 కోట్ల పాక్ రూపాయాలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 11 కోట్ల రూపాయల్ని మెయిన్ హాల్ పునర్నిర్మాణానికే ఖర్చు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ప్రధాన కాంప్లెక్స్ను ఆనుకుని ఉన్న మదరసా అల్ సబీర్, జైషే కమాండర్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇక్కడ కొత్త నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సమాచారం.
భారత దాడుల్లో దెబ్బతిన్న భవనాలకు కొత్త మార్బుల్ వేశారు. ప్లాస్టర్, పెయింట్తో భవనాలను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దారు . దెబ్బతిన్న గోపురాలను కూడా తిరిగి నిర్మించారు. ప్రధాన హాల్లో దాడుల వల్ల దెబ్బ తిన్న భాగాలను తొలగించారు. భవనానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించారు.
బహవల్పూర్లోని మార్కజ్ సుభాన్ అల్లా అంతర్జాతీయ సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 18 ఎకరాల్లో ఈ భారీ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దీనిని ‘ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మసీదుతో పాటు జైష్-ఎ-మొహమ్మద్కు సంబంధించిన పలు సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం.
భారత్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ హస్తం ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు నిర్థారించాయి. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడులను జైష్-ఎ-మహమ్మద్ చేయించినట్లు భారత్ ఆరోపించింది. ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన స్థావరం.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో పునర్నిర్మాణం కావడం భారత ఇంటెలిజెన్స్ వర్గాలను అలర్ట్ చేసింది.