
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రయాణించిన స్టార్లైనర్ మిషన్పై అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసిన విచారణ నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మిషన్ను అత్యంత ప్రమాదకరమైన టైప్-ఏ మిషాప్గా నాసా వర్గీకరించింది. గతంలో 2003లో కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయిన కొలంబియా షటిల్ విపత్తును కూడా నాసా ఇదే కేటగిరీలో చేర్చడం గమనార్హం. కేవలం 8 రోజుల పర్యటన కోసం 2024 జూన్లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు సాంకేతిక లోపాల వల్ల ఏకంగా 286 రోజులు అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 19న విడుదల చేసిన 311 పేజీల నివేదికలో నాసా ఈ వైఫల్యానికి గల ప్రధాన కారణాలను వెల్లడించింది.
నౌకను నడిపే ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాలు తలెత్తినట్లు నాసా వెల్లడించింది. మిషన్లోని ఐదు థ్రస్టర్లు మొరాయించడంతో పాటు అత్యంత ప్రమాదకరమైన హీలియం లీకేజీలు సంభవించాయని తెలిపింది. కల్పనా చావ్లా ప్రమాదం సమయంలో ఇంజనీర్ల హెచ్చరికలను అధికారులు ఎలాగైతే బేఖాతరు చేశారో.. స్టార్లైనర్ విషయంలోనూ అదే కల్చరల్ బ్రేక్డౌన్ పునరావృతమైందని విచారణ కమిటీ తేల్చిచెప్పింది. భద్రతా హెచ్చరికలను పెడచెవిన పెట్టి, మిషన్ను గడువులోగా పూర్తి చేయాలనే ఒత్తిడితో అధికారులు ముందుకు సాగడం పెను తప్పిదమని నివేదిక స్పష్టం చేసింది.
ఈ సాంకేతిక వైఫల్యాల వల్ల సుమారు 200 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, సునీతా విలియమ్స్ బృందం 2025 మార్చి 18న స్పేస్ఎక్స్ ద్వారా సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంతో సునీతా విలియమ్స్ తన కెరీర్లో మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపి, ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.