నాసా.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. మరో మెగా డ్రీమ్ ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టుకుంది. చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక మహిళా వ్యోమగామిని ప్రవేశపెట్టాలన్నది నాసా తాజా ప్రణాళిక. దీనికి Artemis (గ్రీక్ దేవత పేరు) అని నామకరణం కూడా చేసుకుంది. మరో ఐదేళ్ళలో అంటే.. 2024లోగా ఎట్టిపరిస్థితుల్లో Artemis మిషన్ పూర్తి చేయాలన్నది నాసా పట్టుదల. కానీ.. దానికి తగ్గ ‘చమురు’ దగ్గరే వచ్చింది చిక్కంతా..! నిధుల కొరత కారణంగా ‘అర్తెమిస్’ ప్రోగ్రాం అటకెక్కే ప్రమాదంలో పడిందట!
అర్ధ శతాబ్దం కిందట నాసా చేపట్టిన అపోలో మిషన్ మొట్టమొదటిసారిగా మనిషిని (మగాడ్ని) చంద్రుడిపైకి పంపింది. ఇప్పుడు మహిళను పంపాలన్నది తాజా ప్రయత్నం. కానీ.. ఈ ప్రాజెక్టుకి ఏకంగా 1.6 బిలియన్ డాలర్లు (రూ. 11 వేల కోట్లు) అవసరమని లెక్క తేల్చింది నాసా. 21.5 బిలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ తో నడిచే నాసా.. ఈ ఏడాది ఇప్పటికే నాలుగున్నర బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేసింది. 2024లోగా నాసా ‘అర్తెమిస్’ మిషన్ ని పూర్తి చేస్తుందన్న నమ్మకం తమకు లేదంటున్న అమెరికన్ లా మేకర్స్.. నిధుల మంజూరులో వ్యూహాత్మక జాప్యం చేస్తున్నారు. దీని ఫలితమే స్పేస్ లాంఛ్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి నాసా తంటాలు పడుతోంది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఆధిపత్యం చెలాయించాలన్న పట్టుదల ఉన్నప్పటికీ.. ట్రంప్ సర్కార్ నాసా మీద ఒత్తిడి తీసుకురాలేకపోతోంది.