Mali terror attack: మరోసారి నెత్తురోడిన పశ్చిమాఫ్రికా.. బస్సుపై ఉగ్రవాదుల భీకర కాల్పులు.. 32 మంది సజీవదహనం!

|

Dec 04, 2021 | 11:55 AM

పశ్చిమాఫ్రికా మరోసారి రక్తమోడింది. మాలిలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి భీకరంగా కాల్పులకు తెగబడ్డారు.

Mali terror attack: మరోసారి నెత్తురోడిన పశ్చిమాఫ్రికా.. బస్సుపై ఉగ్రవాదుల భీకర కాల్పులు.. 32 మంది సజీవదహనం!
Mali Terror Attack
Follow us on

Mali terror attack: పశ్చిమాఫ్రికా మరోసారి రక్తమోడింది. మాలిలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి భీకరంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 32 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బండియాగ్రా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. సోంగో గ్రామానికి చెందిన స్థానికులు బండియాగ్రాలోని ఓ మార్కెట్‌కు బస్సులో వెళ్తున్నారు. శుక్రవారం కూడా సోంగోతో పాటు చుట్టుపక్కల గ్రామలకు చెందిన మహిళలు మార్కెట్‌లో పనిచేసేందుకు వెళ్లారు. బస్సులో వెళ్తుండగా వారిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. నడిరోడ్డుపై బస్సును ఆపి ముందు బస్సు డ్రైవర్‌ను చంపేశారు. ఆ తర్వాత బస్సు టైర్లలో గాలి తీసి.. తుపాకులతో ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అంతటితో ఆగలేదు. బస్సుపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనలో బస్సులో ఉన్న 32 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సు తగులబడుతున్న దృశ్యాలు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాలిలో కొన్ని నెలలుగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అల్ ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ మాలిలో మిలిటెంట్లు పేట్రేగిపోతున్నారు. ఇటీవల యూఎన్ కాన్వాయ్‌పై దాడి చేశారు. ఆ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ భీకర దాడి జరిగింది. మాలిలో ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాట్లు కూడా అక్కడి దారుణ పరిస్థితులకు ఒక కారణం. గత 16 నెలల్లో రెండు సార్లు తిరుగబాటు జరిగింది. బలహీనమైన ప్రభుత్వాలు ఉండడంతోనే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత మే నెలలోనే మాలిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. తాజా ఉగ్రదాడిపై ఆ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు మార్కెట్‌లో పనికి వెళ్తున్నారని స్థానిక వర్గాలు తెలిపాయి. మాలిలో వేగంగా పెరుగుతున్న జిహాదీల తిరుగుబాటులో ఈ ఘోరమైన దాడి మరో ఉదాహరణ అని తెలిపింది. బస్సు సోంగో గ్రామం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న బండియాగరాలోని మార్కెట్‌కి వారానికి రెండుసార్లు ప్రయాణిస్తున్నందున దీనని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అల్-ఖైదా మరియు ఐఎస్‌ఐఎల్‌తో సంబంధం ఉన్న యోధులచే ఆజ్యం పోసిన ఇటీవలి నెలల్లో హింసాత్మకంగా పెరుగుతున్న పశ్చిమ ఆఫ్రికా దేశం మోప్టి ప్రాంతం నడిబొడ్డున ఈ దాడి జరిగింది.

Read Also…  West Bengal: బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర గవర్నర్ ధంఖర్