Coronavirus: మళ్లీ కరోనా ప్రళయం.. నౌకలో ప్రయాణిస్తున్న 800 మందికి పాజిటివ్.. ఆ దేశంలో అలర్ట్..
కరోనా మహమ్మారి జడలు విప్పుతోందా? ఆస్ట్రేలియా తీరంలోని ఓ నౌకలో 800 కేసులు బయటపడటం, చైనా నగరాల్లో పరిస్థితులు మరింత ముదరడం ఆందోళన కలిగిస్తోంది
ప్రపంచం నుంచి కరోనా క్రమంగా తొలగిపోతోందనే ఆనందం ఆవిరైపోతోంది.. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన మేజెస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్లో దాదాపు 800 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నౌకను ఆస్ట్రేలియా తీరంలోని సిడ్నీ తీరంలో నిలిపేశారు. ఈ క్రూయిజ్ 12 రోజుల పాటు సముద్రయానం చేసింది. ఇందులో 4,600 మంది ప్రయాణీకులు సిబ్బంది ఉన్నారు.. మెల్బోర్న్ చేరాల్సిన మేజెస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్లో ఇంత భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగించింది. ప్రయాణీకులందరినీ ఐసోలేషన్లో ఉంచారు. 2020లో కూడా ఆస్ట్రేలియా తీరంలో రూబీ ప్రిన్సెస్ క్రూజ్ నౌకలో భారీ స్థాయిలో కరోనావైరస్ కేసులు బయటపడటం కలవరం రేపింది. మరోవైపు ఆస్ట్రేలియాలో వారం రోజుల వ్యవధిలో 19,800 కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా దేశంలో కోవిడ్ నాల్గవ వేవ్ వచ్చినట్లు NSW చీఫ్ హెల్త్ ఆఫీసర్ ధృవీకరించారు. క్రిస్మస్ నాటికి కోవిడ్ కేసులు పెరుగుతాయని.. ఆ తర్వాత తగ్గుతాయని కెర్రీ చాంట్ పేర్కొన్నారు. విక్టోరియా, క్వీన్స్లాండ్లో కేసులు తీవ్రమయ్యాయని.. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. టీకా తీసుకోని వారు ఉంటే వెంటనే తీసుకోవాలని.. అవసరమైతే బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
కరోనావైరస్ పుట్టినిల్లు చైనాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఒక్కరోజులో 11వేలకు పైగా కొవిడ్ కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. బీజింగ్, గ్వాంగ్జౌ, జెంగ్ఝౌ, చాంగ్కింగ్ నగరాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కొవిడ్ కట్టడి కోసం చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీ, కఠినమైన లాక్డౌన్- క్వారంటైన్ ఆంక్షలు ఏమాత్రం ఫలించడంలేదు.
కోట్లాదిమంది ప్రజలు కొవిడ్ పరీక్షల కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచిచూడక తప్పడం లేదు.. వారాల తరబడి ఆంక్షల ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థ మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే చాలా నగరాల్లో పరిశ్రమలు పని చేయడం లేదు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..