
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్లోని అకాబా సమీపంలో ఉన్న అమెరికా మెరైన్ల శిబిరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. భారీ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించామని, ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు మరణించినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే ఈ వాదనలను అమెరికా లేదా ఇతర స్వతంత్ర వర్గాలు ఇప్పటివరకు ధృవీకరించలేదు.
ఇరాన్ మీడియా సంస్థ తస్నిమ్ కథనం ప్రకారం.. అకాబా సమీపంలోని ‘టిటిన్’లో ఉన్న యూఎస్ మెరైన్ క్యాంప్పై భారీ క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో పలు కీలక సైనిక స్థావరాలు, అమెరికా దాడి హెలికాప్టర్లు ధ్వంసమైనట్లు IRGC వెల్లడించింది. అయితే, నష్టానికి సంబంధించిన వివరాలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
ఇదే సమయంలో బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరంపై కూడా ఇరాన్ భారీ డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడికి సంబంధించిన సమాచారం కూడా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. మరోవైపు, ఇరాన్లో నౌకా రవాణాకు సంబంధించిన ప్రాంతాలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. జిరోఫ్ట్, బందర్ అబ్బాస్, కిష్ ద్వీపం, కొనరాక్, చబహార్, జాస్క్, సిరిక్, లవాన్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
హోర్ముజ్పై ఇరాన్ పట్టు.. ఒమన్తో చర్చలు
హోర్ముజ్ జలసంధిపై తమకు నియంత్రణ ఉందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. గతంలో ప్రతి 24 గంటలకు కనీసం 120 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించేవని ఆయన తెలిపారు. ఇప్పుడు కొన్ని రాత్రులకు రెండు, మూడు నౌకలు మాత్రమే వెళ్లగలిగినా.. జలసంధిపై ఇరాన్ నియంత్రణకు అదే సంకేతమని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను నియంత్రించేందుకు దక్షిణాన ఉన్న ఒమన్తో ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన అమెరికాకు ఆమోదయోగ్యమవుతుందా అన్నది స్పష్టంగా లేదు. గల్ఫ్ దేశాలు మాత్రం హోర్ముజ్ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా తిరిగి తెరవాలని కోరుతున్నాయి.
అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
అమెరికా దాడులకు ప్రతిస్పందన తప్పదని ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్, ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ హెచ్చరించాయి. సిస్తాన్-బలూచిస్తాన్, హోర్ముజ్గాన్ ప్రావిన్సుల్లో అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిగా నిర్ణయాత్మక, వినాశకరమైన దాడులు చేస్తామని ప్రకటించాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక చర్యలను కొనసాగిస్తే మరింత తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
అయితే అమెరికా స్థావరాలపై జరిగినట్లు చెబుతున్న దాడులు, అమెరికా సైనికుల మరణాలు, సైనిక పరికరాల ధ్వంసానికి సంబంధించిన ఇరాన్ వాదనలను ఇప్పటివరకు స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు. దీంతో ప్రస్తుతానికి ఇరాన్, అమెరికా వైపుల నుంచి వస్తున్న ప్రకటనలను ఆరోపణలు, ప్రత్యారోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..