AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా నుంచి భారతీయుల గెంటివేత.. 205 మందితో అమృత్‌సర్‌లో విమానం ల్యాండింగ్‌!

అమెరికాలో ఉన్నన్నాళ్లు ఒక రకం జీవితాన్ని గడిపారు భారతీయ అక్రమ వలసదారులు. అభద్రత, భయంతో కూడిన జీవితాన్ని వెళ్లదీశారు. అయితే జీతాన్ని డాలర్లలో చూసుకోవడానికి, డాలర్‌ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి ఆ కష్టాలను భరించారు, సహించారు. తాజాగా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు డొనాల్డ్ ట్రంప్‌.

అమెరికా నుంచి భారతీయుల గెంటివేత.. 205 మందితో అమృత్‌సర్‌లో విమానం ల్యాండింగ్‌!
Us Returns 2025
Balaraju Goud
|

Updated on: Feb 05, 2025 | 8:22 AM

Share

అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్‌ సర్కార్‌. చరిత్రలోనే తొలిసారిగా మిలటరీ విమానాల్లో అక్రమ వలసదారులను, వారివారి దేశాలకు తరలిస్తోంది. ఈ డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా లేటెస్టుగా 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది. టెక్సాస్‌ నుంచి అమెరికా సీ-17 మిలటరీ విమానంలో వాళ్లను భారత్‌కు తరలించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉన్నవాళ్లను స్వదేశానికి తరలిస్తున్నారు. తొలి దశలో 20వేల మంది భారతీయులను వెనక్కి పంపించేందుకు అమెరికా రెడీ అయ్యింది.

అమెరికా నుంచి అమృత్‌సర్‌కు డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా టెక్సాస్‌ నుంచి 205 మంది భారతీయులతో బయలుదేరిన సీ-17 మిలటరీ విమానం అమృత్‌సర్‌ చేరుకుంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉన్నవాళ్లను స్వదేశానికి తరలిస్తున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో భాగంగా 205 మంది భారతీయులను మిలటరీ విమానంలో పంపించేశారు. మంగళవారం టెక్సాస్‌ నుంచి బయలుదేరిన సీ-17 మిలటరీ విమానం అమృత్‌సర్‌ లో అడుగుపెట్టింది.

అసలు ఆ విమానం అమృత్‌సర్‌లోనే ల్యాండింగ్‌ ఎందుకు? అసలు పంజాబ్‌కు అమెరికాకు ఉన్న సంబంధం ఏంటి? అంటే.. మన దేశం నుంచి అమెరికాలో అక్రమంగా చొరబడుతున్న వాళ్లలో పంజాబీలదే మొదటి స్థానం. గుజరాతీలది రెండో స్థానం. అమెరికా నుంచి ఇండియాకు డిపోర్ట్‌ అవుతున్న అక్రమ వలసదారుల్లో ఎక్కువమంది పంజాబ్‌కు చెందినవాళ్లే.. పంజాబ్‌ నుంచి అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారులు డంకీ రూట్‌లో అక్కడకు చేరుకుంటారు. డంకీ అంటే అక్రమంగా చొరబడడం.

ఎలాగైనా అమెరికాకు వెళ్లాలని చూసే సిక్కులు.. దానికోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అలాంటి వాళ్ల మెడ మీద ఇప్పుడు డిపోర్టేషన్‌ కత్తి పెట్టారు ట్రంప్‌. ఇందుకే ఇండియాకు పంపించిన అక్రమ వలసదారుల తొలి ఫ్లైట్ అమృత్‌సర్‌లో డైరెక్టుగా ల్యాండయింది. అమెరికా నుంచి ఇండియాకు పంపించడానికి ఒక్కొక్కరిపై 4వేల 675 డాలర్లు ఖర్చు పెడుతోంది అమెరికా. అంటే మన కరెన్సీలో 4 లక్షల 6 వేల రూపాయలు అవుతుంది. ఇక ఇండియాకు తిరుగుటపాలో వచ్చిన 205మందిపై సుమారుగా 8 కోట్ల 33 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసింది అమెరికా.

అమెరికాలో 7 లక్షల 25 వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. అమెరికాలో మనవాళ్లు మూడో అతి పెద్ద ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ సమూహంగా ఉన్నారు. వీళ్లతో పాటు ఇక అమెరికాలో శరణు కోరే శరణార్థులకు కూడా, ఈ గెంటివేతల కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వడం లేదు. అంతా బ్యాక్‌ టు భారత్‌ అనాల్సిందే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌. అయితే భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తరువాతే వాళ్లను వెనక్కి పంపాలని నిర్ణయించారు.

ఇక మరోవైపు ఫిబ్రవరి 12వ తేదీన అమెరికాకు వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈలోగా అమెరికా నుంచి అక్రమ వలసదారులను తీసుకుని మరో రెండు ఫ్లైట్లు ఢిల్లీలో ల్యాండ్ కానున్నాయి. ఇదిలావుంటే, అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్న నేపథ్యంలో.. NRIల్లో ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే, వారిని వెనక్కి పంపడానికి ఇబ్బంది లేదని, అలాంటి చర్యలకు మద్దతిస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి హాజరైన టైమ్‌లోనే ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి, దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్‌ ఏంజిలిస్‌ డౌన్‌టౌన్‌లో రహదారిని నిరసనకారులు కొన్ని గంటల పాటు దిగ్బంధించారు. ‘ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు ఇమ్మిగ్రెంట్స్‌ అమెరికాను గొప్పగా మార్చారు” అనే నినాదాలతో బ్యానర్లను ప్రదర్శించారు. డిపోర్టేషన్‌కు వ్యతిరేకంగా టారెంట్‌ కౌంటీలో కూడా నిరసన స్వరాలు వినిపించాయి. అయితే ట్రంప్‌ సర్కార్‌ మాత్రం, ఈ నిరసనలను లెక్కచేయడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us