Former Presidents On Washington Incident: అగ్రరాజ్యంలో అధికార మార్పిడి జరుగుతున్న సమయంలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి జరిగింది. ఒక్కసారిగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై యావత్ ప్రపంచం స్పందిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ దుర్ఘటనను ఖండించారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ హింసాత్మక ఘటన చరిత్రలో చేదు అనుభవంగా నిలిచిపోనుంది ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్పై జరిగిన దాడి గొప్ప సిగ్గుచేటు.. కానీ, ఇది ముందే ఊహించిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ట్రంప్ తన ఓటమి అంగీకరించి.. ఆ నిజాన్ని తన మద్దతుదారులకు చెప్పడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు బిల్క్లింటన్, జార్జ్ డబ్ల్యూ.బుష్, జిమ్మీ కార్టర్ కూడా కాపిటల్ భవనం వద్ద జరిగిన హింసను ఖండించారు.ఈ ఘటనపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ.. స్వదేశమైనా, విదేశమైనా ఎన్నికల హింస క్షమించరానిదని అన్నారు.
కాగా, వాషింగ్టన్ డీసీ ఘర్షణకు బాధ్యతవహిస్తూ ట్రంప్ యంత్రాంగంలోని కీలక అధికారి, వైట్హౌస్ మాజీ ప్రెస్ సెక్రెటరీ స్టెఫానియా గ్రాసిమ్ రాజీనామా చేశారు. ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పలువురు అభివర్ణించారు. మరోవైపు ట్రంప్ ఖాతాను 12 గంటలు స్తంభింపజేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. ఇక ఫేస్బుక్ సైతం ట్రంప్ అకౌంట్ను 24 గంటలపాటు స్తంభింపజేశామని చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది