అమెరికా ఎన్నికలపై మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Nov 09, 2020 | 6:39 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మాజీ అధ్యక్షుడు డబ్ల్యూ బుష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రాథమికంగా ఎలాంటి అవినీతి జరగలేదని రిపబ్లికన్ పార్టీ నేత బుష్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

అమెరికా ఎన్నికలపై మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మాజీ అధ్యక్షుడు డబ్ల్యూ బుష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రాథమికంగా ఎలాంటి అవినీతి జరగలేదని రిపబ్లికన్ పార్టీ నేత బుష్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజాగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని బుష్ అన్నారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ తిరిగి ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, రిపబ్లికన్ పార్టీలో ఆయన తర్వాత దేశాధ్యక్ష పదవి చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలిపారు.

జో బైడెన్ విజయాన్ని అంగీకరించిన జార్జ్ డబ్లూ బుష్.. ఆయనకు అభినందనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 70 మిలియన్ల ఓట్లు సాధించడం రాజకీయపరంగా గొప్ప విజయమని బుష్ వ్యాఖ్యానించారు. అయితే, రీకౌంటింగ్ ను కోరడంతోపాటు ఎన్నికల ఫలితాలపై చట్టపరంగా పోరాడే హక్కు ట్రంప్‌నకు ఉందని బుష్ స్పస్టం చేశారు. కాగా, 2016లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన బుష్ సోదరుడు జెట్ బుష్.. జో బైడెన్‌కు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాజీ అధ్యక్షులు, రిపబ్లికన్ సెనెటర్లు కూడా బైడెన్ విజయాన్ని స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

కాగా, ఇటీల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారు. జో బైడెన్‍‌కు అత్యధికంగా 290 ఎలక్టోరల్ ఓట్లు పోలవ్వగా, డొనాల్ ట్రంప్‌నకు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, ఈ ఎన్నికలను జో బైడెన్ దొంగిలించారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయపోరాటానికి సైతమని సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.