అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జో బైడెన్ హవా
అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి బైడెన్ల మధ్య నువ్వా..? నేనా..? అన్న రీతిలో సాగుతున్నాయి.
అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి బైడెన్ల మధ్య నువ్వా..? నేనా..? అన్న రీతిలో సాగుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లోనూ రెండు పార్టీల మధ్య కేవలం స్వల్ప తేడానే ఉండటం మరింత టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే, కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో జో బైడెన్ విజయ ఢంకా మోగిస్తున్నారు. అటు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) ని మాత్రం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ క్లీన్ స్వీప్చేశారు. ఇప్పటివరకు ఆయనకు దాదాపు 93 శాతం పాపులర్ ఓట్లు లభించాయి. ట్రంప్నకు కేవలం 5.6శాతం మాత్రమే వచ్చాయి. 6 లక్షలకు పైగా జనాభా కలిగిన వాషింగ్టన్ డీసీలో బైడెన్కు 2 లక్షలకు పైగా పాపులర్ ఓట్లు పడ్డాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 12 వేల పైచిలుకు పాపులర్ ఓట్లు మాత్రమే సాధించారు. అయితే, చిన్న నగరం కావడంతో ఇక్కడ ఎలక్టోరల్ ఓట్లు 3 మాత్రమే ఉన్నాయి. ఈ మూడింటి డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కైవసం చేసుకున్నారు.
ఇదిలావుంటే, అమెరికాలో పాపులర్ ఓట్లు ఎక్కువ సాధించినప్పటికీ అధ్యక్షుడిగా విజయం సాధించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజేతను నిర్ణయించేది మాత్రం ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే. 538 ఎలక్టోరల్ ఓట్లున్న అమెరికాలో 270సాధించిన వారు మాత్రమే విజేతగా నిలుస్తారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్నకు ఇప్పటివరకు 213 ఎలక్టోరల్ ఓట్లు రాగా బైడెన్కు 225 ఓట్లు వచ్చాయి. మిగతా స్థానాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, టెక్సాస్లో ట్రంప్ విజయం సాధించారు.