
భారత్, పాకిస్థాన్ నేను చెబితేనే యుద్ధం ఆపేశాయంటూ క్రెడిట్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై స్పందించిన ట్రంప్ తాజాగా మరోసారి భారత్, పాక్ కాల్పుల విరమణపై మాట్లాడారు. ఖతార్లోని ఒక స్థావరంలో ఉన్న అమెరికన్ సైనికులతో ట్రంప్ మాట్లాడుతూ.. “గత వారం భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యను పరిష్కరించడానికి తాను కచ్చితంగా సహాయం చేశానని, మరింత ఎక్కువయ్యే ప్రతికూల పరిస్థితిని తాను పరిష్కరించాను.
అయితే మొత్తం నేనే చేశానని చెప్పదలచుకోలేదు… కానీ గత వారం భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యను పరిష్కరించడానికి నేను కచ్చితంగా సహాయం చేశాను, ఇది మరింత శత్రుత్వంగా మారుతుండగా, అకస్మాత్తుగా మీరు వేరే రకం క్షిపణులను చూడాల్సి వచ్చేది, కానీ, మేం దాన్ని పరిష్కరించాం” అని ట్రంప్ అన్నారు.
అమెరికా రెండు దేశాలతో వాణిజ్యాన్ని పెంచే అవకాశం ఉండటం వల్ల కాల్పుల విరమణ సులభతరం అయిందని కూడా ఆయన పేర్కొన్నారు. వారితో వాణిజ్యం గురించి మాట్లాడాం, యుద్ధానికి బదులుగా వాణిజ్యం చేద్దాం అని నేను ఇరు దేశాలతో చెప్పాను, దాంతో ఇరు దేశాలు సంతోషంగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్ వెల్లడించారు. భారత్, పాక్ దాదాపు వెయ్యి సంవత్సరాలుగా పోరాడుతున్నాయి. ఈ సమస్యను తాను పరిష్కగలనని నమ్మానని, అలాగే పరిష్కరించానంటూ పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి