
నేపాల్ లో సంభవించిన సునామీ లాంటి భీకర వరద సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా జనం తేరుకోలేదు. కుటుంబసభ్యులను ఆప్తులను కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. చేతిలో ఫొటోలు పట్టుకుని శవాగారాలు ఆస్పత్రుల చుట్టూ కన్నీటితో తిరుగుతూనే ఉన్నారు. నేపాల్ జల ప్రళయానికి నేటికి ఆరు రోజులు పూర్తవుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భారీ ఆకస్మిక వరద విపత్తులో ఇప్పటివరకు 903 మంది మరణించగా.. 4200 మందికి పైగా గల్లంతయ్యారు. మరో వైపు తన భార్య తనతో ఫోన్ లో మాట్లాడిన ఆ మాటలే చివరి మాటలు అవుతాయని ఊహించలేదని ఇటీవలే వివాహమైన బ్రిటన్ కు చెందిన వ్యక్తి షాకవుతున్నాడు.
నేపాల్లోని త్రిశూలి వ్యాలీలో అద్భుతం జరిగింది. ఓ ఉపాధ్యాయుడు సమయస్ఫూర్తి తో వ్యవహరించి ఏకంగా 1,643 విద్యార్థుల ప్రాణాలు కాపాడారు. ఆఖరు నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో వరదల బారిన పడకుండా చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం 9.20 గంటల సమయంలో త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్ రాజేంద్ర దవాడీ పాఠాలు చెబుతున్నారు. ఆ సమయంలో ఆయనకి ఓ ఫోన్ అలర్ట్ వచ్చింది. ఏంటా అని చూడగా స్నేహితుడు పంపిన వరద హెచ్చరిక. రాజేంద్ర దవాడీ పరిగెత్తుకుంటూ వెళ్లి గంట కొట్టారు. విద్యార్థులను బస్సులలోకి ఎక్కించాలని టీచర్లను ఆదేశించారు. అంతలోనే.. స్కూల్ బస్సులు సురకితం కావని భావించారు. పాఠశాల పక్కనే ఉన్న ఎత్తైన కొండ ప్రాంతానికి విద్యార్థులను చేర్చారు. నిమిషాల వ్యవధిలోనే వరద ముంచెత్తింది. కళ్ల ముందే మూడంతస్థుల భవనం కొట్టుకుపోయింది. తీవ్రంగా షాకైన విద్యార్థులు, టీచర్లు రాజేంద్ర దవాడీకి మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
వరదలతో అతలాకుతలమైన నేపాల్లో మరో మిరాకిల్ జరిగింది. రసువా జిల్లా టిమురే ప్రాంతంలో వందలాది ఇళ్లు కూలిపోయి ఊళ్ళకు ఊళ్లు నేలమట్టమయ్యాయి. గల్లంతైన వారి కోసం మూడవ రోజు సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఆ సమయంలో సిబ్బందికి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. మృత్యువును జయించిన బాలికను చూసి వెంటనే శిథిలాల నుంచి సిబ్బంది వెలికితీసారు. తీవ్ర గాయాలతో నీరసించిన బాలికను హెలికాప్టర్లో కాట్మాండులోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ రోజు వీలుపడలేదు మరునాడు శనివారానికి ఆసుపత్రికి తరలించగలిగారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటోందని వైద్యులు ప్రకటించారు.
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలలో తన భార్యను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాడు ఇటీవలే వివాహమైన యూకేకు చెందిన వ్యక్తి . ఆ రోజు తన భార్య తనతో ఫోన్ లో ఆఖరుసారిగా ఐ లవ్ యూ చెప్పిందని ప్రమోద్ పౌడెల్ తెలిపాడు. వివాహమై కొన్ని రోజులే గడిచాయని తన భార్య తన తల్లి, తమ్ముడు, మామతో కలిసి ఉంటోందని ప్రస్తుతం వారి ఆచూకీ తెలియలేదని వాపోయాడు. అతని స్వగ్రామం సోలెలో దాదాపు 800 మంది గల్లంతు కాగా గ్రామంలో ఇప్పటివరకు ఏ బంధువును కూడా తాను సంప్రదించలేకపోయానని 34 ఏళ్ల ప్రమోద్ తెలిపాడు. తన భార్యతో పాటు తన తల్లి, తమ్ముడు, మామను వెతుకుతూ ప్రస్తుతం ఆ వ్యక్తి నేపాల్ చేరుకున్నాడు.