బంగ్లాలో మరోసారి ఉద్రిక్తత! మాజీ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..!

బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ అవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్ పూర్వీకుల ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి తీవ్ర కలకలం రేపింది. మగురా పట్టణంలోని కేశవ్‌మోర్ ప్రాంతంలో ఉన్న ఆయన పూర్వీకుల ఇంటిపై బుధవారం (ఆగస్టు 05) రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరి, ఆస్తిని ధ్వంసం చేసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటన భారతదేశంలోని న్యూఢిల్లీలో మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

బంగ్లాలో మరోసారి ఉద్రిక్తత! మాజీ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..!
Shakib Al Hasan Ancestral Home Petrol Bomb Attack

Updated on: Aug 06, 2026 | 7:57 AM

బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ అవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్ పూర్వీకుల ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి తీవ్ర కలకలం రేపింది. మగురా పట్టణంలోని కేశవ్‌మోర్ ప్రాంతంలో ఉన్న ఆయన పూర్వీకుల ఇంటిపై బుధవారం (ఆగస్టు 05) రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరి, ఆస్తిని ధ్వంసం చేసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటన భారతదేశంలోని న్యూఢిల్లీలో మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ దాడిని తీవ్రంగా ఖండించిన అవామీ లీగ్, ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించింది. “పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇళ్లను తగలబెట్టడం ప్రజాస్వామ్య దేశంలో జరిగే పని కాదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ నయా-ఫాసిజం నీడలో ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది” అని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే చర్యలు కొనసాగుతున్నాయని, అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది.

అవామీ లీగ్ ప్రకారం, షేక్ హసీనా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందే బీఎన్‌పీ, జమాత్-ఇ-ఇస్లామీ, ఎన్‌సీపీ వంటి పార్టీలు జాతీయ మీడియా సంస్థలను బెదిరించాయని పేర్కొంది. ఆ సమావేశానికి సంబంధించిన వార్తలను ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని వెల్లడించింది. ఈ పరిణామాలన్నీ రాజకీయ అసహనానికి నిదర్శనమని అవామీ లీగ్ ఆరోపించింది.

ఇదిలా ఉండగా, షేక్ హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఆమెకు మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కల్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తనపై కేసులు ఉన్నప్పటికీ ఆమెకు వేదిక కల్పించడం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని భారత ప్రభుత్వానికి ముందుగానే తెలియజేశామని పేర్కొంది. హసీనా, ఆమె సహచరులు బంగ్లాదేశ్ ప్రజలు, ప్రభుత్వంపై విషపూరిత వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించింది.

వర్చువల్ సమావేశంలో మాట్లాడిన షేక్ హసీనా, తన ప్రభుత్వాన్ని కూలదోసిన ఘటనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం అవసరమైతే అరెస్టును, మరణాన్ని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. “దేశానికి తిరిగి రావడం.. అధికారాన్ని తిరిగి పొందడం కోసం కాదు. బంగ్లాదేశ్‌ను అభివృద్ధి, లౌకికవాదం, శ్రేయస్సు మార్గంలోకి తీసుకురావడానికే వస్తాను. నన్ను జైలులో పెట్టినా, చంపినా నా ప్రజల మధ్యకే తిరిగి వస్తాను” అని హసీనా వ్యాఖ్యానించారు.

కాగా, షకీబ్ అల్ హసన్ ఇంటిపై దాడి, షేక్ హసీనా ప్రకటనలు, బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతిస్పందనలతో ఆ దేశ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us