భారత్ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసిన ఆస్ట్రేలియా

విదేశీ దరఖాస్తుదారుల నుంచి వచ్చిన వీసా అభ్యర్ధనలను రికార్డు స్థాయిలో తిరస్కరించింది. ఆస్ట్రేలియాకు వచ్చే విద్యార్థులు నిజంగా చదువుకోవాలనుకుంటున్నారో? లేదో? నిర్ధారించుకోవడానికి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంతో దాదాపు 40% మంది భారతీయుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నారు. ఏప్రిల్‌లో విడుదల చేసిన హోం వ్యవహారాలశాఖ డేటా ప్రకారం..

భారత్ విద్యార్ధులకు బిగ్‌షాక్‌.. వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసిన ఆస్ట్రేలియా
Australia Tightens Student Visa Documentation

Updated on: Apr 07, 2026 | 7:56 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. విదేశీ దరఖాస్తుదారుల నుంచి వచ్చిన వీసా అభ్యర్ధనలను రికార్డు స్థాయిలో తిరస్కరించింది. ఆస్ట్రేలియాకు వచ్చే విద్యార్థులు నిజంగా చదువుకోవాలనుకుంటున్నారో? లేదో? నిర్ధారించుకోవడానికి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంతో దాదాపు 40% మంది భారతీయుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నారు. ఏప్రిల్‌లో విడుదల చేసిన హోం వ్యవహారాలశాఖ డేటా ప్రకారం ఫిబ్రవరిలో విదేశీ ఉన్నత విద్యా వీసా దరఖాస్తులలో సుమారు మూడింట ఒక వంతు తిరస్కరణకు గరయ్యాయి. ఇందులో వీసా ఆమోద రేటు 67.6 శాతంగా మాత్రమే ఉంది. ఇది గత 21 యేళ్లలో అత్యల్ప మంజూరు రేటు. సెప్టెంబర్ 2023లో అత్యల్పంగా 68.1 శాతంగా నమోదైంది. కోవిడ్ అనంతరం ఆస్ట్రేలియా దేశం సరిహద్దులు తిరిగి తెరచుకున్న సమయంలో ఇది జరిగింది.

తిరస్కరణకు గురవుతున్న దక్షిణాసియా దేశాల వీసాలు

ప్రధానంగా దక్షిణాసియా దేశాలలో ఈ తిరస్కరణ మరింత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భూటాన్ నుంచి వచ్చిన దరఖాస్తులలో సుమారుగా 36 శాతం, శ్రీలంక నుండి 38 శాతం, భారత్‌ నుండి 40 శాతం, బంగ్లాదేశ్ నుండి 51 శాతం, నేపాల్ నుండి 65 శాతం దరఖాస్తులను ఆస్ట్రేలియా అధికారులు తిరస్కరించారు. మరోవైపు గత 12 ఏళ్లలో చైనా నుంచి వచ్చిన దరఖాస్తులు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. గతంలో అధిక ఆమోద రేట్లను చూసిన చైనా నుంచి వీసా కేసుల భారం వేరే దేశాలకు మారుతోంది. 2025లోని అదే నెలతో పోలిస్తే 39 శాతం తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా నుండి వచ్చిన దరఖాస్తులు 12 ఏళ్లలో అత్యల్ప స్థాయికి పడిపోయాయి. చైనా నుంచి దరఖాస్తులు తగ్గితే.. మిగతా దక్షిణాసియా దేశాల నుంచి మాత్రం దరఖాస్తులు గణనీయంగా పెరిగాయి. భారత్‌ నుంచి దరఖాస్తులు ఏడాదివారీగా 36 శాతం పెరిగాయి. అలాగే బంగ్లాదేశ్‌లో 51 శాతం, నేపాల్‌లో 91 శాతం అధికంగా పెరిగాయి.

గత వారం ఆస్ట్రేలియా తన వీసా రిస్క్ ఫ్రేమ్‌వర్క్ కింద జనవరి 2026లో విడుదల చేసిన జాబితాలో భారత్‌ను అత్యధిక ప్రమాదం ఉన్న కేటగిరీలో చేర్చినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. దీని అర్థం భారతీయ విద్యార్థుల దరఖాస్తులను ఇకపై మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నమాట. దరఖాస్తుదారులు ఇకపై మరిన్ని పత్రాలను సమర్పించవసి ఉంటుంది. ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫ్రేమ్‌వర్క్ కింద భారతీయ దరఖాస్తుదారులను ఎవిడెన్స్ లెవల్ 2 (EL2) నుంచి ఎవిడెన్స్ లెవల్ 3 (EL3)కి మార్చారని, దీనివల్ల విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు కూడా పెరుగుతాయని కేంద్రం రాజ్యసభకు తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

అయినప్పటికీ భారత్‌ ఆ దేశంలో ఒక కీలకమైన మూల దేశంగా కొనసాగుతోంది. గతేడాది నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లతో పాటు భారత్‌ నుంచి వచ్చిన విద్యార్థులు ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు ఉన్నారు. సుమారు 650,000 మంది విద్యార్థులలో దాదాపు 1,40,000 మంది భారతీయులే ఉండటం గమనార్హం. వర్గీకరణ మార్పు అంటే వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులకు వీసా రాదని అర్థం కాదు. ఆ ప్రక్రియ మరింత వతపోతకు గురై క్లిష్టంగా మారుతుంది. ఖచ్చితమైన విద్యా అర్హతలు, ఆర్థిక పత్రాలు ఉన్నవారికి మాత్రమే వీసా దక్కే అవకాశం ఉంది. అయితే వీసా ఆమోదానికి గతంలో కంటే కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us