
బంగ్లాదేశ్లో అరాచక శక్తుల హింసకు అడ్డుకట్ట పడటం లేదు. హిందువులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. దిపు చంద్ర దాస్, అమృత్ మండల్ వంటి వారి దారుణ హత్యలు మరువక ముందే, మైమెన్సింగ్లో మరో హిందూ ప్రాణం బలయ్యింది. ఒక వస్త్ర కర్మాగారంలో వందలాది మంది చూస్తుండగానే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ను ఓ యువకుడు కాల్చి చంపడం కలకలం రేపుతోంది. మైమెన్సింగ్లోని ఒక వస్త్ర కంపెనీలో బజేంద్ర, నోమన్ మియాన్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 22 ఏళ్ల నోమన్ పక్కా ప్రణాళికతో తన వద్ద ఉన్న తుపాకీని తీసి నేరుగా బజేంద్ర బిశ్వాస్ వైపు గురిపెట్టాడు. అందరూ చూస్తుండగానే నిందితుడు కాల్పులు జరపడంతో బజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు నిందితుడు నోమన్ను అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు గురైన బజేంద్ర బిశ్వాస్ కేవలం ఫ్యాక్టరీ కార్మికుడు మాత్రమే కాదు. తన గ్రామానికి రక్షణగా ఏర్పడిన పారామిలిటరీ గ్రూపులో ఆయన క్రియాశీల సభ్యుడిగా ఉండేవారని సమాచారం. హిందూ గ్రామాలపై దాడులు జరుగుతున్న తరుణంలో వారిని రక్షించేందుకు బజేంద్ర ముందుండటమే ఈ దాడికి ఒక కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై సాగుతున్న అకృత్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. మైమెన్సింగ్లోనే దిపు చంద్ర దాస్ను ఒక గుంపు ఫ్యాక్టరీ నుండి ఈడ్చుకెళ్లి వీధుల్లో కొట్టి చంపింది. అంతటితో ఆగక, అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి రోడ్డుపైనే నిప్పంటించారు. శాంతిభద్రతలను కాపాడతామని ప్రకటించిన మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, మైనారిటీల ప్రాణాలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని ఈ వరుస హత్యలు నిరూపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ మాసంలోనే 8 మందికి పైగా హిందువులను బంగ్లాదేశ్ అల్లరిమూకలు పొట్టనబెట్టుకున్నాయి.
బంగ్లాదేశ్లో హిందువుల మారణహోమంపై ఇప్పటికే భారత్ సహా పలు దేశాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలలో, వీధుల్లో బహిరంగంగా జరుగుతున్న ఈ హత్యలు అక్కడి హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలు నింపుతున్నాయి. యూనుస్ ప్రభుత్వం అదుపు చేయలేని ఈ అరాచక శక్తులు, బంగ్లాదేశ్ను అస్థిరత వైపు నెడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..