
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్ష హెలికాప్టర్ ‘మెరైన్ వన్’కు తృటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో మెరైన్ వన్ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఎన్వాయ్ ఎయిర్ వాణిజ్య ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి వచ్చింది. ఫైలట్ సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి.
FAA వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం (ఆగస్టు 04) మధ్యాహ్నం ఫ్లోరిడాలోని పెన్సకోలాకు వెళ్తున్న మెరైన్ వన్, బయలుదేరుతున్న ప్యాసింజర్ జెట్ మధ్య కొద్దిసేపు భద్రతా దూరం తగ్గింది. అయితే వెంటనే రెండు విమానాలు ఒకదానికొకటి దూరంగా వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముందుజాగ్రత్త చర్యగా మరో విమానాన్ని కూడా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్లో లోపాలు జరిగినట్లు తెలుస్తోంది. మెరైన్ వన్ సిబ్బంది టేకాఫ్కు మూడు నిమిషాల ముందు కంట్రోల్ టవర్కు పలుమార్లు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు అయినప్పటికీ, ఆ సందేశాలు పూర్తిగా అందలేదని అమెరికా మీడియా వెల్లడించింది. అనంతరం హెలికాప్టర్ టేకాఫ్ ప్రారంభించే సమయానికి ప్యాసింజర్ జెట్ రన్వేపై ప్రయాణం మొదలుపెట్టింది. అప్రమత్తమైన కంట్రోలర్లు, పైలట్ల చర్యలతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనతో వాషింగ్టన్ గగనతల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2025 జనవరిలో రీగన్ నేషనల్ విమానాశ్రయం సమీపంలో సైనిక హెలికాప్టర్, ప్రయాణికుల విమానం గాల్లో ఢీకొని 67 మంది మృతి చెందిన ఘటన తర్వాత విమాన భద్రత మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ తాజా ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
అయితే అధ్యక్షుడు ట్రంప్కు ఎలాంటి ప్రమాదం లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మెరైన్ వన్ను ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక పైలట్లు నడుపుతారని, అధ్యక్షుడి భద్రత ఎప్పుడూ ప్రమాదంలో పడలేదని అధికార ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, అవసరమైతే భవిష్యత్తులో అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తామని FAA వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..