
ఒకే ఒక్క క్షణం.. ఆనందంతో కేరింతలు కొట్టిన ఆ గొంతుకలు శాశ్వతంగా మూగబోయాయి. సరదాగా సాగిపోతున్న విహారయాత్ర.. కన్నీటి సముద్రమైంది. వియత్నాం అందాలను చూసి వద్దామని వెళ్లిన భారతీయ పర్యాటకులను.. విధి ఎంత దారుణంగా వంచించిందో చెప్పడానికి మాటలు రావడం లేదు. ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో స్పీడ్ బోట్ బోల్తా పడిన ఘటనలో.. 15 మంది అమాయక ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఊహించని ఈ ఘోర కలిలో కడప, మచిలీపట్నం కుటుంబాలు కోలుకోలేని శోక సముద్రంలో మునిగిపోయాయి.
విధి ఆడిన వింత నాటకంలో.. ఆ నవ్వులు ఆవిరైపోయాయి. లగేజీ సర్దుకుని, ఎన్నో ఆశలతో, అంతకంటే ఎక్కువ సంతోషంతో విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ ప్రాణాలు.. ఇలా శవాలై తిరిగి వస్తాయని ఎవరైనా అనుకున్నారా? వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర స్పీడ్బోట్ ప్రమాదం 15 మంది భారతీయ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
హాన్ మే రట్ ద్వీపం నుంచి ఆన్ తోయ్ రేవుకు 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బందితో ‘ఓషన్ పియర్ ఐలాండ్’ సంస్థకు చెందిన స్పీడ్బోట్ బయల్దేరింది. తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఉండగా.. మృత్యువు రాక్షస అలల రూపంలో విరుచుకుపడింది. ఆ రాకాసి అలలకు ఒక్కసారిగా బోటు తలకిందులైంది. ఊపిరాడక, ఏం జరుగుతుందో తెలియక, కాపాడమంటూ ఆ నీటిలోనే వారు వేసిన కేకలు సముద్రపు ఘోషలో కలిసిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ఇతర బోట్ల సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందించి అక్కడకు చేరుకున్నారు. కానీ.. పడవ పూర్తిగా బోర్లా పడిపోవడంతో పర్యాటకులు బోటు లోపలే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీయడం ఎవరివల్లా కాలేదు. అలల ఉధృతి ఆ అమాయకులను సముద్రం లోపలికి లాగేసుకుంటుంటే.. తీరంలో ఉన్న తోటివారంతా గుండెలు బాదుకుంటూ కళ్లప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేకపోయారు.
ఓ ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా తమ బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన బిజినెస్ ఇన్సెంటివ్ ఆఫ్సైట్ ట్రిప్లో భాగంగా వీరంతా వియత్నాం వెళ్లారు. భారతదేశం నుంచి మొత్తం 250 మంది వెళ్లగా, వారిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. వియత్నాం పడవ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ మరణించినట్లు అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ ఘటనలో 13 మంది పురుషులు, ఇద్దరు మహిళలతో సహా కనీసం 15 మంది భారతీయులు మృతి చెందారని.. ఆ పడవలో మొత్తం 36 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
కళ్ల ముందే తోటి మిత్రులు, ఆత్మీయులు నీటిలో మునిగిపోతుంటే.. ఒడ్డున నిలబడి ఏమీ చేయలేక మూగగా రోదించిన కడప డిస్ట్రిబ్యూటర్ నయీం ఆవేదన వర్ణనాతీతం. ప్రాణాలైతే దక్కాయి కానీ.. కళ్లముందు జరిగిన ఆ దారుణం ఆయన గుండెల్లో జీవితాంతం పీడకలగా మిగిలిపోనుంది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా.. తమ వాళ్లు బతికున్నారో లేదో తెలియక, కనీసం ఆఖరి చూపుకైనా నోచుకుంటామో లేదోనని స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులు ఏడుస్తున్న తీరు చూస్తే రాతి గుండెలైనా కరిగిపోవాల్సిందే. పడవ కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే, బోల్తా పడిందని.. స్పందించేలోపే అంతా నీటమునిగామని.. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు ఏపీ మంత్రి నారా లోకేష్ ఏపీ భవన్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి బాధితుల సహాయార్థం హో చి మిన్ సిటీ, హనోయి నగరాల్లో తక్షణమే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. 32 మంది పర్యాటకుల అధికారిక జాబితాను విడుదల చేసి, మృతదేహాలను భారత్కు తీసుకువచ్చేందుకు స్థానిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ప్రమాదం వియత్నాంలో సరిగ్గా ఏడాది క్రితం, అంటే జూలై 2025లో ప్రసిద్ధ ‘హా… లాంగ్ బే’లో తుఫాను కారణంగా బోట్ మునిగిపోయి 35 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ఘటనను గుర్తుచేస్తోంది. మళ్లీ ఏడాది తిరగకముందే 15 మంది భారతీయులను బలితీసుకున్న ఈ తాజా ఘటన.. వియత్నాం పర్యాటక ప్రాంతాల్లో రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలపై పలు అనుమానాలను, తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
వియత్నాం పడవ దుర్ఘటన తాజా సమాచారం: “పడవ కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే, మేము స్పందించేలోపే బోల్తా పడింది”: ప్రాణాలతో బయటపడిన వ్యక్తివియత్నాం పడవ ప్రమాదంలో భారతీయ పర్యాటకుల మృతి వార్తా విశేషాలు: ఈ ఘటనలో 13 మంది పురుషులు, ఇద్దరు మహిళలతో సహా కనీసం 15 మంది భారతీయులు మృతి చెందారు. ఆ పడవలో మొత్తం 36 మంది ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..