ఇంట్లో తెలియకుండా ట్రిప్‌ ప్లాన్‌.. విమానం గాల్లో ఉండగానే…!

పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాలు, షికార్లకు వెళ్తుంటారు. ఫ్రెండ్స్‌తో ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తుంటారు. ఇంట్లో చెప్తే వెళ్లనివ్వరని చాలామంది ఇలా చేస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల వేషాలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఆ విషయం వీళ్లకి తెలియక ఒక్కోసారి అడ్డంగా బుక్కయిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తండ్రికి తెలియకుండా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుని ఫ్లయిట్‌ ఎక్కిన ఆ యువకుడి ప్లాన్‌ బెడిసికొట్టడంతో ఎక్కినచోటే విమానం దిగాల్సి వచ్చింది.

మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు తానాజీ సావంత్‌ కుమారుడు రిషిరాజ్‌ ఫిబ్రవరి 10న రాత్రి వేళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా ఓ ఛార్టర్డ్‌ విమానాన్ని బుక్‌ చేసుకొని బ్యాంకాక్‌ బయల్దేరారు. హమ్మయ్య దాటేశాం.. ఇంక మనల్నెవ్వరూ ఆపరు.. అంతా బాగానే ఉంది…అనుకునేలోపు..ఊహించనివిధంగా విమానం ఎక్కిన చోటుకే వచ్చి ల్యాండ్‌ అయ్యింది. పూణె ఎయిర్‌పోర్టు నుంచి వారిని తీసుకెళ్లిన ఛార్టర్డ్‌ విమానం మార్గమధ్యంలో ఉండగా.. తన కుమారుడిని కిడ్నాప్‌ చేశారంటూ తానాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డీజీసీఏ సాయంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. అప్పటికే అండమాన్‌ వరకు వెళ్లిన ఆ విమానం వెనక్కి మళ్లింది.