హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో ..వెలుగులోకి సంచలన నిజాలు

|

Jan 26, 2025 | 2:41 PM

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో డొంక కదులుతోంది. పోలీసులు దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలకనంద అస్పత్రి ఘటనలో తీగ లాగుతూ కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ కేసులో సుమంత్‌, అవినాష్‌ అనే ఇద్దరు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. సరూర్‌నగర్‌ అలకనంద ఆస్పత్రిని సుమంత్‌ రన్ చేస్తుండగా.. అవినాష్.. డాక్టర్‌గా పని చేస్తున్నట్లు తేల్చారు. అవినాష్‌తోపాటు.. బయట నుండి ఇద్దరు డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నట్లు వెల్లడైంది.

అవినాష్ గతంలో చైనాలో మెడిసిన్ చేసి హైదరాబాద్‌లో సుమంత్‌ను కలిసి కిడ్నీ మార్పిడి సర్జరీలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ఇక.. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. కోర్టు ఆదేశాలతో ఇద్దర్ని రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్‌ అయినవారిని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత డిసెంబర్‌లో ఏకంగా 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లు తేల్చారు. ఇతర దేశాల్లో మెడిసిన్ చేసిన వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారన్నారు రాచకొండ సీపీ సుధీర్‌బాబు. డొనేట్ చేసిన వాళ్లకు 5 లక్షలు, ఒక్కో సర్జరీకి డాక్టర్‌ అవినాష్‌కు రెండున్నర లక్షలు ఇస్తున్నారని తెలిపారు.