తాగుబోతు భర్తలతో పడలేక ..ఆ మహిళలు ఏం చేశారో చూడండి!

తాగుబోతు భర్తలతో పడలేక ..ఆ మహిళలు ఏం చేశారో చూడండి!

Samatha J

|

Updated on: Jan 26, 2025 | 2:46 PM

భర్త రోజూ మద్యం సేవించి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఏ ఇల్లాలైనా ఎంతకాలం భరిస్తుంది అని చాలామంది అంటారు. ఏదో ఒక సందర్భంగా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. తాజాగా ఇద్దరు మహిళలు తమ భర్తలు పెట్టే హింసలు భరించలేక ఇంటినుంచి వెళ్లిపోయి.. ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

యూపీకి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో బాధపడుతున్నారు. వారి వారి భర్తలు మద్యానికి బానిసలై రోజూ తాగి వచ్చి ఇంట్లో చేసే రచ్చ చెప్పుకుంటూ బాధపడుతుండేవారు. మద్యం మత్తులో తమ భర్తలు తిట్టే తిట్లను, పెట్టే హింసను ఇక భరించలేమని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. భర్తలతో సంబంధం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకుని వేరే ఊరిలో కలిసి ఉండాలని కవిత, బబ్లూ డిసైడ్ అయ్యారు. ఆపై ఇద్దరూ ఇల్లు వదిలి గోరఖ్ పూర్ చేరుకున్నారు. మహిళలు ఇద్దరూ ఓ శివాలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇందులో బబ్లూ పెళ్లికొడుకులా కవిత నుదుట తిలకం దిద్దింది. ఆపై ఇద్దరూ దండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు. దంపతులుగా మారిన కవిత, బబ్లూ ఇకపై గోరఖ్ పూర్ లోనే ఉంటామని, ఏదైనా పనిచేసుకుంటూ జీవిస్తామని చెప్పారు.