AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం

122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం

Phani CH
|

Updated on: Apr 28, 2026 | 1:33 PM

Share

ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి 122 ఏళ్లుగా మూసి ఉన్న రహస్యం. 1903లో బ్రిటీష్ అధికారులు ఆలయ రక్షణ కోసం ఇసుకతో నింపి సీల్ చేశారు. ఇప్పుడు భారత పురావస్తు శాఖ (ASI) ఆధునిక సాంకేతికతతో ఆ ఇసుకను తొలగిస్తూ గర్భగుడిని పునరుద్ధరిస్తోంది. లోపల ఏముందో అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చర్య ఆలయానికి మరో 1000 ఏళ్ల ఆయుష్షును ఇస్తుందని భావిస్తున్నారు.

ప్రపంచ అద్భుతాల్లో ఒకటి.. యునెస్కో గుర్తించిన వారసత్వ కట్టడం.. భారతీయ శిల్పకళా వైభవానికి నిలువుటద్దం.. అదే ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం. అయితే, గత 122 ఏళ్లుగా ఈ ఆలయ గర్భగుడి అనేది ఒక మూసి ఉన్న రహస్యం. 1903 నుండి ఇప్పటివరకు ఏ మానవుడూ ఆ గర్భగుడిలోకి అడుగుపెట్టలేదు. కానీ ఇప్పుడు కాలం మారింది! చరిత్ర తిరగరాయబోతున్నారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఏఎస్ఐ (ASI) ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అందుకే ఆ మూసి ఉన్న తలుపులు త్వరలో తెరుచుకోనున్నాయి. ఆ గర్భగుడిలో అసలు ఏముంది? బ్రిటిషర్లు ఆ రోజు ఎందుకు ఇసుక నింపారు? ఇప్పుడు ఆ ఇసుకను ఎలా తీస్తున్నారు? 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన లాంగులా నరసింహదేవ ఈ అద్భుతాన్ని నిర్మించారు. సుమారు 12 ఏళ్ల పాటు వేల మంది శిల్పులు రాత్రింబవళ్లు కష్టపడి దీనిని ఒక రథం ఆకారంలో మలిచారు. ఏడు గుర్రాలు, 24 చక్రాలతో సూర్యభగవానుడు ఆకాశంలో పయనిస్తున్నట్లుగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. సముద్ర తీరాన ఉన్న ఈ కట్టడం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అప్పట్లో నావికులకు ఒక దిక్సూచి కూడా. దీనిని “బ్లాక్ పగోడా” అని పిలిచేవారు. ఈ అద్భుత కట్టడం 1900 కాలంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ వెనుక గోడలు బలహీనపడి పగుళ్లు రావడంతో, ప్రధాన నిర్మాణం కూలిపోకుండా ఉండేందుకు 1903-04లో అప్పటి బ్రిటిష్ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. లోపలి భాగాన్ని పటిష్టం చేసేందుకు జగమోహన హాల్ మొత్తాన్ని ఇసుకతో నింపి, పూర్తిగా సీల్ చేసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గర్భగుడిలోకి ఎవరికీ ప్రవేశం లేదు. కాలక్రమంలో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయ ప్రధాన శిఖరం కూలిపోయింది. మిగిలి ఉన్న ‘జగమోహన హాల్’ కూడా 1900 కాలం నాటికి శిథిలావస్థకు చేరుకుంది. 1903 నాటికి ఆలయ గోడల్లో పగుళ్లు వచ్చాయి. లోపలి రాళ్లు జారిపడుతున్నాయి. ఏ క్షణమైనా ఈ అద్భుత నిర్మాణం నేలమట్టం అయ్యే ప్రమాదం ఉందని అప్పటి బ్రిటిష్ ఇంజనీర్లు గుర్తించారు. బ్రిటిష్ అధికారి జె.ఎ. బోర్డియన్ భవనాన్ని రక్షించడానికి ఒక వింతైన ప్లాన్ వేశారు. జగమోహన హాల్ లోపల ఖాళీ ప్రదేశం లేకుండా వేల టన్నుల ఇసుకను నింపాలని ఆదేశించారు. పైకప్పు నుండి రంధ్రం చేసి లోపలికి ఇసుకను పంపారు. ఆ తర్వాత నాలుగు వైపుల తలుపులను శాశ్వతంగా మూసివేసి, చుట్టూ గోడలు కట్టారు. అప్పటి నుండి గర్భగుడి చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అయితే 122 ఏళ్ల వరకు ఇసుక లోపలి గోడలకు సపోర్టుగా ఉంది. కానీ కాలక్రమంలో ఆ ఇసుక కిందకు కుంగిపోయింది. ఇసుక కుంగిపోవడం వల్ల పైన 4 నుండి 5 అడుగుల ఖాళీ ఏర్పడింది. దీనివల్ల పైన ఉన్న రాళ్లపై ఒత్తిడి పెరిగి మళ్ళీ పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత పురావస్తు శాఖ ఇప్పుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిశ్చయించుకుంది. ఇసుకను తీసివేసి, లోపలి గోడలను ఆధునిక పద్ధతిలో బలపరిస్తే, ఆలయం మరో 1000 ఏళ్ల పాటు పదిలంగా ఉంటుంది. ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన 30 మంది సభ్యుల బృందం రంగంలోకి దిగింది. నిర్మాణం దెబ్బతినకుండా ఉండేందుకు జీరో-వైబ్రేషన్ డైమండ్ డ్రిల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. నిర్మాణంపై ఒత్తిడిని గమనించేందుకు 40 హై-ప్రెసిషన్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి ఇసుకను తీయకుండా, దశలవారీగా తొలగిస్తూ లోపలి రాళ్లకు తగిన సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మరో మూడు నెలల్లో పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజ్‌మహల్ తర్వాత భారత్‌లో అత్యధిక పర్యాటకులు… అంటే ఏటా దాదాపు 35 లక్షల మంది సందర్శించే కట్టడం కోణార్క్ సూర్య దేవాలయం. ఈ ఆపరేషన్ విజయవంతమైతే, శతాబ్దం తర్వాత తొలిసారిగా భక్తులు గర్భగుడిని దర్శించుకునే వీలు కలుగుతుంది. “ఆలయానికి మరో వెయ్యి సంవత్సరాల ఆయుష్షును అందించడమే మా లక్ష్యం” అని ఏఎస్ఐ అధికారులు వెల్లడించారు. ఈ వార్తతో భక్తులు, పర్యాటక రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 127 అడుగుల ఎత్తైన ఆలయం లోపల 80 అడుగుల ఎత్తులో జీరో-వైబ్రేషన్ డ్రిల్ ఉపయోగిస్తారు. డ్రిల్లింగ్ ద్వారా, లోపల ఇసుకతో పాటు 8.5 మీటర్ల పొడవు, 160 మిమీ వెడల్పు కలిగిన రాతి నమూనాను సేకరించి విశ్లేషణ కోసం ఐఐటీ మద్రాస్‌కు పంపారు. నమూనా నివేదిక అందిన తర్వాత, గర్భగుడి నుండి ఇసుకను శాస్త్రీయంగా తొలగించి, ఆపై ఆలయాన్ని పునర్నిర్మిస్తారు. ఇసుకను తొలగించి గర్భగుడిని ఖాళీ చేసిన తర్వాత, నిర్మాణ సమయంలో ఎలా ఉందో అలాగే నిర్మాణాన్ని పునర్నిర్మిస్తారు. గర్భగుడిలో ఏముందో ఎవరికీ తెలియదు. అప్పట్లో అక్కడ గాలిలో తేలే విగ్రహం ఉండేదని, అయస్కాంత శక్తి ఉండేదని కథలు ఉన్నాయి. ఇసుక తీశాక అక్కడ ఏవైనా ప్రాచీన శిల్పాలు లేదా శాసనాలు బయటపడతాయేమోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇసుక తొలగింపు ప్రక్రియకు మూడు నెలలు పడుతుంది. అంతా సవ్యంగా జరిగితే, వచ్చే ఏడాది నాటికి సామాన్య భక్తులు కూడా 122 ఏళ్ల తర్వాత గర్భగుడిని దర్శించుకోవచ్చు. గర్భగుడి తెరుచుకుంటే మాత్రం పర్యాటక రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పౌడర్ రాసుకుంటేనే కూలీ.. లేదంటే..!

Director Shankar: రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్

నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న ‘మైఖేల్’

Monalisa Bhosale: ప్రేమ – పెళ్లి – ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా

సుశాంత్ సూసైడ్ కేసులో.. ప్రియురాలు రియాకు బిగ్ రిలీఫ్‌

Follow Us