ప్రియుడి మోసం.. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి

Updated on: Nov 25, 2025 | 7:30 PM

కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన శిశు విక్రయం ఘటనలో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడు రోజుల నవజాత శిశువును ఆరు లక్షలకు విక్రయించేందుకు యత్నించిన తల్లి, కొనుగోలుదారులు, మధ్యవర్తులు ఇందులో ఉన్నారు. ప్రియుడు మోసం చేయడంతో బిడ్డను పోషించలేక తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రేమించానని వెంట పడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. శారీరకంగా లోబరుచుకున్నాడు.. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. అనంతరం.. ఆమె నమ్ముకున్న ప్రియుడు వదిలి వెళ్ళిపోయాడు. అయితే, కొన్నాళ్లకు ఆమె పండంటి బాబుకి జన్మనిచ్చింది.. కానీ, పోషించే స్థోమత లేక.. 7 రోజుల బాబును ఆమె అమ్మేందుకు సిద్దమైంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. కొనుగోలు దారులతోపాటు.. మధ్యవర్తులను అరెస్ట్ చేశారు. ఈ శిశు విక్రయం ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనతో సంబంధమున్న 16 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైజాగ్ భీమిలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. భర్తతో విడిపోయి హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. ఇక్కడ ఓ వ్యక్తితో కలిసి ఉంటూ..ఓ బేబీకేర్ సెంటర్‌లో పనిచేస్తోంది. అతడితో కొన్నాళ్లపాటు ప్రేమాయణం తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఈనెల 14న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ పండండి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాలుడిని పోషించలేక ఆ బాబును విక్రయించేందుకు కరీంనగర్ కు చెందిన కొందరిని ఆశ్రయించింది.. దీంతో వారు రంగంలోకి దిగి బాబును అమ్మకానికి పెట్టారు. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం చాకలివాని పల్లికి చెందిన రాయమల్లు-లత దంపతులకు పిల్లలకు లేకపోవడంతో బాబును కొనుక్కోవాలనుకున్నారు. ఇందుకోసం కొంతమంది మద్యవర్తిత్వంతో సుమారు 6 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై తమకు డయల్ 100, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ 1098 ద్వారా అందిన సమాచారం ఆధారంగా కరీంనగర్ బైపాస్ రోడ్డులో బాబును కొనుగోలు చేసిన వారిని, అమ్మిన వారిని, మధ్యవర్తిత్వం వహించిన వారిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే.. ఈ వ్యవహారంలో చేతులు మారింది 6 లక్షలు కాదని, అంతకు మించి నగదు లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ లావాదేవీల పంపకాల్లో వచ్చిన విబేధాలతోనే కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న చిన్నారిని పోలీసులు మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించగా.. వైద్య పరీక్షల కోసం కరీంనగర్ జిల్లా అస్పత్రికి తరలించారు. ఎవరయినా పిల్లలను పెంచుకోవాలనుకుంటే చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని.. ఇలాంటి ఇల్లీగల్ క్రయవిక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సృజన్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏడాదిగా కోమాలో కొడుకు.. ఆలయం ముందు పడుకోబెటిన తండ్రి.. కట్ చేస్తే

కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మ హత్య

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ ఇదే

Tomato Price: బంగారంతో పోటీపడుతున్న టమాటా.. బాబోయ్.. ఏంటి ఆ ప్రైజ్

వామ్మో.. దుకాణం ముందు పిండిబొమ్మ, కోడిగుడ్లు.. వణికిపోతున్న బస్తీ వాసులు