సముద్రంలో అల్పపీడనం..తెలంగాణలో వర్షాలు!
తెలంగాణ లో వాతావరణం మారుతోంది. ఓవైపు ఫిబ్రవరి మూడో వారం నుంచే వేసవి తాపం మొదలై భానుడు ప్రతాపం చూపిస్తుండగా, మరోవైపు వరుణుడు పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీలంక సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అల్పపీడన ప్రభావంతో ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, భారీ వర్షాల ముప్పు లేదని, అక్కడక్కడ చినుకులు పడే అవకాశం మాత్రమే ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంది. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. శుక్రవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగానే ఉన్నాయి. ఆదిలాబాద్లో 35.8 డిగ్రీలు, ఖమ్మంలో 35.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం నుంచి తేమగాలులు అల్పపీడన ప్రాంతం వైపు వీస్తుండటంతో వేడి గాలుల ప్రభావం పెరిగింది. మెదక్ జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. గాలిలో తేమ శాతం 35 నుంచి 42 శాతం మధ్య ఉండటంతో ఉక్కపోత కూడా తోడవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :