దొంగను పట్టించిన ర్యాపిడో.. వీడియో వైరల్
చార్మినార్ ఎక్స్ప్రెస్లో నవంబర్ 11 అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ప్రయాణిస్తున్న బెంగుళూరుకు చెందిన కోదండరామిరెడ్డి బ్యాగ్ను గుర్తు తెలియని వ్యక్తి తీసుకుని పరారయ్యాడు. ఏసి బోగీలో అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఈ చోరీని తొలుత ఎవరూ గమనించలేదు. అయితే నిద్ర మధ్యలో లగేజీని చెక్ చేసుకున్న కోదండరామిరెడ్డి గుండె గుభేలు మంది.. రూ. 48 లక్షల విలువచేసే బంగారు నగలు, విలువైన వస్తువులు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ ఒంగోలు దాటిన తరువాత నెల్లూరు జిల్లా కావలిలో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు ఏసీ బోగీలో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా చీరాల – ఒంగోలు మధ్య చోరీ జరిగిందని గ్రహించారు. సీసీ కెమెరాలో నిందితుడి కదలికలను గుర్తించి ఫోటోను అన్ని రైల్వే స్టేషన్లకు పంపించి సిబ్బందిని అప్రమత్తం చేశారు.
నిందితుడు నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి మరో రైలులో హైదరాబాద్కు చేరుకున్నట్టు గుర్తించారు. తిరిగి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేందుకు హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ర్యాపిడో బైక్పై వచ్చినట్టు సిసి కెమెరా పుటేజ్లో బయటపడింది. ర్యాపిడో బైక్ నెంబర్ను సిసి కెమెరా పుటేజ్ ద్వారా గుర్తించి బైక్ యజమానిని విచారించారు. ఎవరు బుక్ చేసుకున్నారో తెలుసుకున్నారు. నిందితుడు బంగారాన్ని అమ్మేందుకు విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్నట్టు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకుని పట్టుకున్నారు. నిందితుడిని తెలంగాణా రాష్ట్రం బాలాపూర్కు చెందిన షకీల్ అహ్మద్గా గుర్తించారు. నిందితుడి నుంచి చోరీకి గురైన 48 లక్షలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఒంగోలు రైల్వే సిఐ మౌలా షరీఫ్, నెల్లూరు రైల్వే సిఐ సుధాకర్, ఇతర టీం సభ్యులను రైల్వే డిఎస్సి మురళీధర్ అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం :