Weekend Hour: పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ స్పీడ్‌ పెంచుతున్నారా? వారాహి యాత్ర దానికి సంకేతమేనా..

Weekend Hour With Murali Krishna: ఏపీ పాలిటిక్స్‌లో విపక్షాల పవర్‌ ప్లే జోరందుకుంటోంది. ఒక వైపు టీడీపీ నేత లోకేష్‌ పాదయాత్ర, మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండో విడత వారాహి యాత్ర, ఆంధ్రప్రదేశ్‌లో కాక పుట్టిస్తోంది. టార్గెట్‌ వైసీపీగా సాగుతున్న పవన్‌ కల్యాణ్‌ జోరు రానున్న రోజుల్లో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated on: Jul 09, 2023 | 7:00 PM

Weekend Hour With Murali Krishna: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ ప్రెషర్‌ పెరుగుతోంది. ఎన్నికలకు దాదాపు ఏడెనిమిది నెలలు ఉన్నా పార్టీల ప్రచారం, ప్రత్యర్థులపై విమర్శలతో అక్కడ రాజకీయాన్ని రంజుగా మార్చుతోంది.

ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో విజయయాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు తన యాత్ర రెండో విడత మొదలుపెట్టారు. ఈ యాత్రను ఏలూరు నుంచి శ్రీకారం చుట్టారు.

వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృధాపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తనదైన ముద్ర వేస్తుందని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. తొలి విడత యాత్రలో అధికార YCPని టార్గెట్‌ చేస్తూ పవన్‌ కల్యాణ్‌ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. తొలి విడత యాత్ర సాగిన తీరు, దానికి లభించిన స్పందనపై పవన్‌ కల్యాణ్‌ సమీక్ష కూడా నిర్వహించారు.

రెండో విడత యాత్రలో భాగంగా దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటన సాగనుంది.ఆ నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై మాట్లాడతారు జనసేన ఇప్పటికి ప్రకటించింది.

అటు తన ప్రచారంలో YCPని పవన్‌కల్యాణ్‌ టార్గెట్‌ చేస్తే అంతే దీటుగా YCP కూడా రియాక్టవుతోంది. సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ హీరో కావచ్చు కాని, రాజకీయాల్లో మాత్రం ఆయన సైడ్‌ హీరోనేనని మంత్రి అమర్‌నాథ్‌ విమర్శించిన పరిస్థితి.

మొదటి విడతతో పోల్చితే పొలిటికల్‌గా పవన్‌ కల్యాణ్‌ తన దూకుడును మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. చూస్తుంటే పొలిటికల్‌గా పవన్‌కు స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్‌ ఆ మెసెజ్‌ ఎలా చేర్చుతారో చూడాలి.