Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీనాబ్‌ బ్రిడ్జ్‌పై వందే భారత్‌ పరుగులు!

చీనాబ్‌ బ్రిడ్జ్‌పై వందే భారత్‌ పరుగులు!

Samatha J

|

Updated on: Jan 26, 2025 | 3:14 PM

జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై తొలిసారి వందే భారత్‌ రైలు పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ రైలును భారత రైల్వే శనివారం ప్రారంభించింది. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్‌ నుంచి శ్రీనగర్‌ వరకు వందే భారత్‌ రైలు ప్రయాణించింది. ఈ మార్గమధ్యంలో చీనాబ్‌ నది పై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

కశ్మీర్‌ లోయలోని అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్‌ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డ కట్టకుండా ఉండేలా అత్యాధునిక హీటింగ్‌ వ్యవస్థలను ఇందులో ఏర్పాటుచేశారు. కాగా.. గతేడాది జూన్‌లో ఈ వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.