సత్తాచాటిన తెలుగోడు.. శ్రీనగర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం

Updated on: Nov 14, 2025 | 5:25 PM

శ్రీనగర్‌లోని ఓ పోస్టర్ ఆధారంగా ఐపీఎస్ డా. జీవీ సందీప్ చక్రవర్తి కాశ్మీర్‌లో విస్తరించిన భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జైష్-ఎ-మొహమ్మద్ నెట్‌వర్క్‌ను ఛేదించి, దేశవ్యాప్తంగా జరగనున్న పేలుళ్లను అడ్డుకున్నారు. 2900 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు తేజమైన సందీప్ చాకచక్యంగా వ్యవహరించి దేశాన్ని రక్షించారు.

శ్రీనగర్‌లోని ఓ వీధిలో కనిపించిన ఒక సాధారణ పోస్టర్.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఓ భారీ ఉగ్ర కుట్రకు దారితీసింది. ఆ కుట్రను తన అసాధారణ పరిశీలనతో పసిగట్టి, దానిని భగ్నం చేయడంలో కీలక పాత్ర పోషించారు మన తెలుగు తేజం, ఐపీఎస్ అధికారి డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి. కేవలం ఒక హెచ్చరిక పోస్టర్ ఆధారంగా లోతైన దర్యాప్తు జరిపి, దేశవ్యాప్తంగా విస్తరించిన వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌ను ఆయన బృందం ఛేదించింది. 2025 అక్టోబర్ 19న శ్రీనగర్‌లోని నౌగామ్-బున్పోరా ప్రాంతంలో జైష్-ఎ-మహమ్మద్ పేరిట పోస్టర్లు వెలిసాయి. ఈ పోస్టర్లలో భద్రతా దళాలను హెచ్చరిస్తూ.. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని రాసి ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి అలాంటి పోస్టర్లు చాలా అరుదుగా మాత్రమే కనిపించేవి. ఈ నేపథ్యంలో ఎస్పీ చక్రవర్తి దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. ‘కమాండర్ హంజాలా భాయ్’ అనే జైష్ ఉగ్రవాది సంతకంతో ఉన్న ఆ పోస్టర్ల వెనుక పెద్ద కుట్ర దాగివుండొచ్చని అనుమానించి, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ముగ్గురు ఓవర్‌గ్రౌండ్ వర్కర్లను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్‌ను ప్రశ్నించగా.. మల్టీ-స్టేట్ JeM నెట్‌వర్క్‌ బహిర్గతమైంది. ఇది జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో వ్యాపించి ఉంది. తదుపరి దశలో పుల్వామా డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, క్వాజిగుండ్‌కు చెందిన డాక్టర్ ఆదీల్ అహ్మద్ రతర్, లఖ్‌నౌకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్‌లను అరెస్ట్ చేశారు. మౌల్వీ ఇర్ఫాన్ ఇంటిపై జరిపిన దాడిలో టెలిగ్రాం ఛానల్‌ ద్వారా పాకిస్తాన్‌లోని జైష్ ఉగ్రవాది ఉమర్ బిన్ ఖత్తాబ్‌తో సంబంధాలను గుర్తించారు. మొత్తం 9 మంది అరెస్టులతో పాటు, 2,900 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు, బాంబ్ తయారీ సామగ్రి, రెండు ఏకే సిరీస్ రైఫిల్స్ పట్టుకున్నారు. ఇది రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన బ్లాస్ట్‌కు, దీని వెనుక ఉన్న సీరియల్ బ్లాస్ట్ ప్లాన్‌కు కీలక ఆధారంగా మారింది. ఈ కుట్ర రెండు సంవత్సరాల నుంచి రూపొందిందని, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఢిల్లీలో బహుళ బ్లాస్ట్‌లు జరపాలని జైష్ ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. పుల్వామా డాక్టర్ ఉమర్ మొహమ్మద్ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్‌లో ఉపయోగించిన కారును నడిపినట్టు సీసీటీవీ ద్వారా గుర్తించారు. మృతదేహానికి తల్లిదండ్రులతో నిర్వహించిన DNA టెస్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో జన్మించిన డా. జీవీ సందీప్ చక్రవర్తి తండ్రి డా. జీవీ రామగోపాల్ రావు , తల్లి పీసీ రంగమ్మలు పబ్లిక్ సర్వీస్‌లో ఉన్నారు. 2010లో కర్నూల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసిన తర్వాత 2014లో ఐపీఎస్‌లో చేరారు. జమ్ము-కాశ్మీర్‌ పూంచ్‌లో ఏఎస్‌పీ, కూప్వారాలో ఎస్పీ, కుల్గామ్, అనంతనాగ్, శ్రీనగర్‌లో ఎస్పీలుగా పనిచేశారు. ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గామ్ దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఎదుర్కొని హతమార్చిన జమ్ము-కాశ్మీర్ పోలీసు టీమ్‌కు నాయకత్వం వహించారు. ఆరు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్ , నాలుగు జెకే పోలీస్ మెడల్స్ పొందారు. 2025 ఆగస్టు 14న ఆరో గాలెంట్రీ మెడల్ అందుకున్నారు. జమ్ము అండ్‌ కాశ్మీర్‌ పోలీసులలో ‘ఆపరేషన్స్ స్పెషలిస్ట్’గా పిలుస్తారు. అతని వ్యూహాత్మక మేధస్సు, వెనువెంటనే స్పందించే తత్వం ఈ ఆపరేషన్‌లో కీలకం. ఈ విజయంపై సామాజిక మాధ్యమాల్లో సందీప్ పేరు మార్మోగిపోతున్నప్పటికీ, ఆయన తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది అధికారుల కృషి ఉందని, ఇంతటి ప్రచారం అతని భద్రతకు ప్రమాదమని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ 3 గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడు?

అమెరికన్లకు శిక్షణ ఇచ్చి వెళ్లిపోండి.. హెచ్​-1బీ వీసాలపై ట్రంప్‌ కొత్త స్వరం

రెండోసారి చోరికి వచ్చి.. జనానికి దొరికిపోయిన దొంగలు

ఆ రోడ్డు కింద 5 వేల టన్నుల బంగారం.. ఎక్కడంటే ??

ఆ సమస్యలకు చెక్ పెట్టె విధంగా.. హైవేలపై QR కోడ్​ బోర్డులు