చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్‌

Updated on: Dec 22, 2025 | 4:21 PM

తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారతాన్ని చలిపులి గజగజ వణికిస్తోంది. తెలంగాణ, ఏపీలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా, హైదరాబాద్‌లోనూ 10 డిగ్రీల దిగువకు చేరాయి. సంగారెడ్డిలో 4.5°C నమోదైంది. పొగమంచు, హిమపాతంతో ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరవుతోంది. వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలను చలిపులి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీ స్ధాయిలో పడిపోవడంతో చలికి జనం వణికిపోతున్నారు. రాత్రి, ఉదయం టెంపరేచర్ ఊహించని రీతిలో తగ్గిపోతుంది. దీంతో చలి దెబ్బకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోగా.. తెలంగాణలోనూ అదే తరహా పరిస్థితి నెలకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో శనివారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత పదేళ్లల్లో ఇదే అత్యత్ప రికార్డుగా చెబుతున్నారు. ఇక కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే రెండు రోజుల పాటు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు చలి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. హైదరాబాద్‌లో చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో నగరవాసులు వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల స్థాయికి తగ్గిపోతున్నాయి. శనివారం శేరిలింగంపల్లిలో 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. మల్కాజ్‌గిరిలో 8.3 డిగ్రీలుగా రికార్డ్ అయింది. ఇక రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్ల వాతావరణశాఖ గణాంకాలు విడదుల చేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. మధ్యాహ్నం వేళల్లో కూడా చలి వదిలిపెట్టడం లేదు. రాబోయే కొన్ని రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని ప్రజలను వాతావరణశాఖ అలర్ట్ చేసింది. మరోవైపు ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. ఒకవైపు విపరీతమైన చలి, మరోవైపు దట్టమైన పొగమంచు, ఇంకోవైపు హిమపాతం ఉత్తర భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో అంటే, ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్‌, పంజాబ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈనెలాఖరు దాకా పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇక జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ రాష్ట్రాలతోపాటు, కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో కూడా హిమపాతం కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..

సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే

అమెరికా వెళ్లటం ఇక కష్టమే బాస్.. టూరిస్ట్ వీసాపైనా సవాలక్ష ఆంక్షలు

అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

తల్లీ కూతుళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేశారు