AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో క్యాబ్‌ దోపిడీ.. రూ.200 జర్నీకి రూ.500 వసూల్

హైదరాబాద్‌లో క్యాబ్‌ దోపిడీ.. రూ.200 జర్నీకి రూ.500 వసూల్

Phani CH
|

Updated on: May 03, 2026 | 3:59 PM

Share

హైదరాబాద్‌లో రవాణా సంక్షోభం ప్రయాణికులను, డ్రైవర్లను కలవరపెడుతోంది. ఓలా, ఊబర్ వంటి యాప్స్ పర్సనలైజ్డ్ ప్రైసింగ్‌తో దోపిడీ చేస్తున్నాయి. సీఎన్‌జీ కొరత డ్రైవర్ల ఆదాయాన్ని 40% తగ్గించగా, పెరిగిన ధరలు నిత్యావసరాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను, ధరలను నియంత్రించాలి.

విశ్వనగరం హైదరాబాద్.. ఐటీ హబ్. కానీ ఇప్పుడు ఈ నగరం ఒక వింతైన రవాణా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆఫీసుకో, ఎయిర్‌పోర్ట్‌కో వెళ్లాలంటే సామాన్యుడి గుండె దడదడలాడుతోంది. ఒకప్పుడు అందుబాటులో ఉన్న క్యాబ్‌లు, ఆటోలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. గ్యాస్ లేదు.. డీజిల్ లేదు.. ఏసీ వేయము.. అదనంగా డబ్బులు ఇస్తేనే వస్తాం.. ఇవీ ఇప్పుడు వినిపిస్తున్న మాటలు. అసలు హైదరాబాద్ రవాణా వ్యవస్థలో ఏం జరుగుతోంది? అగ్రిగేటర్ యాప్స్ మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి? డ్రైవర్ల గోడు ఏమిటి? నగరంలో క్యాబ్ సేవలు అందించే ప్రముఖ సంస్థలు Ola, Uber, Rapido వంటివి ఒక వింతైన టెక్నాలజీని వాడుతున్నాయి. మీరు ఒకే రూట్‌లో రోజూ ప్రయాణిస్తున్నారా? అయితే మీరు ఆ యాప్స్‌కి దొరికిపోయినట్టే. పర్సనలైజ్డ్ ప్రైసింగ్ అంటే మీరు పదే పదే ఒకే రూట్ బుక్ చేస్తే, అల్గారిథమ్ మిమ్మల్ని “తప్పనిసరి ప్రయాణికుడు”గా గుర్తిస్తుంది. ఫలితంగా సాధారణ ధర కంటే రూ. 100 నుండి రూ. 200 అదనంగా చూపిస్తుంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ డిమాండ్ లేకపోయినా, పీక్ అవర్స్ పేరుతో రేట్లు పెంచడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. గతంలో రూ. 200 ఉన్న రూటుకు ఇప్పుడు రూ. 350 నుండి రూ. 400 వరకు వసూలు చేస్తున్నారు. డ్రైవర్ల డిమాండ్లు – క్షేత్రస్థాయి ఇబ్బందులు కారణంగా క్యాబ్ బుక్ అయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. డ్రైవర్ కాల్ చేసి “ఎక్కడికి రావాలి?” అని అడుగుతారు. దూరం ఎక్కువైతే లేదా ట్రాఫిక్ ఏరియా అయితే రావడానికి నిరాకరిస్తారు. ఒకవేళ వస్తే, “యాప్‌లో చూపించిన దానికంటే రూ. 100 ఎక్కువ ఇవ్వాలి” అని ముందే కండిషన్ పెడుతున్నారు. ఎండలు మండిపోతున్నా, రేట్లు గిట్టుబాటు కావడం లేదంటూ డ్రైవర్లు ఏసీ ఆన్ చేయడం లేదు. అదనపు డబ్బులు ఇస్తేనే ఏసీ వేస్తామని తెగేసి చెప్తున్నారు. ఎయిర్‌పోర్ట్ & రైల్వే స్టేషన్‌ల వద్ద ఈ దోపిడీ మరింతగా ఉంది. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి రెండింతలు వసూలు చేస్తున్నారు. ఇదంతా ఒక వైపు ఉంటే, డ్రైవర్ల వైపు మరో పెద్ద సమస్య ఉంది. అదే సీఎన్జీ కొరత. హైదరాబాద్‌లో సుమారు 1.5 లక్షల సీఎన్జీ వాహనాలు ఉన్నాయి. కానీ గ్యాస్ అందుబాటులో ఉన్న బంకులు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఒక ట్యాంక్ గ్యాస్ నింపుకోవడానికి డ్రైవర్లు 7 నుండి 8 గంటలు క్యూలో నిలబడాల్సి వస్తోంది. లక్డీకాపూల్ నుండి ఖైరతాబాద్ వరకు ఆటోల క్యూ కనిపిస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజులో సగం సమయం క్యూలోనే గడిచిపోతుంటే, ఇక ట్రిప్పులు ఎప్పుడు వేయాలి? దీనివల్ల ఆదాయం 40% వరకు పడిపోయిందని డ్రైవర్లు వాపోతున్నారు. గ్యాస్ స్టేషన్లకు పైపులైన్ల ద్వారా కాకుండా ట్యాంకర్ల ద్వారా గ్యాస్ సరఫరా చేయడం వల్ల జాప్యం జరుగుతోంది. సరఫరా పెరగకపోవడం వల్ల బ్లాక్ మార్కెట్ కూడా పెరిగింది.అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు కిలోకు రూ. 30 నుండి రూ. 50 వరకు పెరిగాయి. బంకుల నిర్వాహకులు కూడా అదనపు ధర వసూలు చేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “గరీబోళ్లను మరింత గరీబులుగా మారుస్తున్నారు” అంటూ సామాన్య డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రవాణా సంక్షోభం కేవలం క్యాబ్‌లకే పరిమితం కాలేదు. ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా సీఎన్జీ వాహనాలు వాడుతుండటంతో, డెలివరీ చార్జీలు పెరిగాయి. నిత్యావసరాల దరలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యాప్ కంపెనీల ఒత్తిడి డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరిగ్గా ట్రిప్పులు వేయలేకపోతే ఓలా, ఉబర్ వంటి కంపెనీలు డ్రైవర్లను బ్లాక్ చేస్తున్నాయి, ఇది వారిని మరింత కుంగదీస్తోంది. మరి ఈ దోపిడీ నుండి మనం ఎలా తప్పించుకోవాలి? అంటే కొన్ని రకాల సూచలను చేస్తున్నారు నిపుణులు. మల్టిపుల్ యాప్స్ వాడాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ ఒకే యాప్ వాడకండి. ఓలా, ఉబర్, ర్యాపిడో ఇలా మూడు నాలుగు యాప్స్‌లో ధరలు చెక్ చేయండి. అల్గారిథమ్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా ఉంటుంది. క్యాబ్ ఎక్కేముందే యాప్ ధరకే వస్తారా అని అడగండి. అదనంగా అడిగితే వద్దని చెప్పండి. ఒకవేళ డ్రైవర్ అదనపు డబ్బులు అడిగి రానంటే, ట్రిప్ క్యాన్సిల్ చేసి యాప్‌లో ఖచ్చితమైన కారణం మెన్షన్‌ చేయాలి. దీనివల్ల డ్రైవర్ రేటింగ్ తగ్గుతుంది. ధరల దోపిడీపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ రవాణా వ్యవస్థ ఇప్పుడు ఒక క్లిష్ట దశలో ఉంది. అటు ఇంధన కొరతతో డ్రైవర్లు, ఇటు పెరిగిన ధరలతో ప్రయాణికులు ఇద్దరూ నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను మెరుగుపరచడంతో పాటు, అగ్రిగేటర్ సంస్థల ధరలపై నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా ?? రూల్స్ మారాయి.. జాగ్రత్త

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..

Singer Mangli: వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..

విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది

గ్యాస్ పై బండ బాదుడు.. త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??

Follow Us