AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ పై బండ బాదుడు.. త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??

గ్యాస్ పై బండ బాదుడు.. త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??

Phani CH
|

Updated on: May 03, 2026 | 3:19 PM

Share

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా స్థిరంగా ఉండటంతో చమురు కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. సమీప భవిష్యత్తులో లీటరుకు రూ.25-28 వరకు ధరలు పెరిగే సూచనలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్షణ ప్రణాళిక లేనప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు మారకుంటే పెంపు అనివార్యం కావచ్చు.

దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందా? అనే ప్రశ్న తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం, ప్రభుత్వ ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలు ఈ ఆందోళనకు కారణం అవుతున్నాయి. అసలు నిజంగా ధరలు పెరగబోతున్నాయా? లేక ఇవి కేవలం ఊహాగానాలేనా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ఉంటుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. విపక్షాలు కూడా ఇదే వాదన చేస్తున్న వేళ వాణిజ్య సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సమీప భవిష్యత్తులో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును కొట్టిపారేయలేమని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, నాలుగేళ్లుగా రిటైల్‌ ధరలు సవరించకపోవడం వల్ల నష్టాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో దేశీయంగా భవిష్యత్తులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగచ్చని తెలుస్తోంది. వాహనదారులకు త్వరలో భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. లీటరు ఇంధనంపై రూ.25 నుంచి రూ.28 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఇది 126 డాలర్ల వరకు చేరి నాలుగు సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, హర్మూజ్‌ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలపై ఆంక్షలు, అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు పెద్దగా మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర సుమారు రూ.94.77, డీజిల్ రూ.87.67 వద్ద కొనసాగుతోంది.అయితే అంతర్జాతీయ ధరలు పెరుగుతున్నా దేశీయంగా ధరలు మార్చకపోవడంతో ఆయిల్ కంపెనీలపై భారీ భారం పడుతోంది. ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు పెట్రోల్‌పై లీటర్‌కు సుమారు రూ.20, డీజిల్‌పై లీటర్‌కు సుమారు రూ.100 వరకు నష్టాన్ని భరిస్తున్నట్లు సమాచారం. ఈ నష్టాలను కొంతవరకు తగ్గించేందుకు కమర్షియల్ LPG, జెట్ ఫ్యూయల్ వంటి వాటి ధరలు పెంచినా, పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం ఇప్పటివరకు పెంచలేదు. ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తక్షణం ధరల పెంపు చేసే ప్రణాళిక లేదు. అయితే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఇదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం మాత్రం పూర్తిగా తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇది ‘ఎన్నికల బిల్లు’ అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తర్వాతి బాదుడు పెట్రోల్, డీజిల్‌పైనే అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణ సెగ తగులుతుందని నేను ముందే చెప్పా.. అన్నట్లుగానే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఒకేసారి రూ.993 పెంచారన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్‌పై రూ.1380 పెంచారని.. అంటే కేవలం మూడు నెలల్లోనే 81శాతం పెరిగిందన్నారు. ఇప్పుడు గ్యాస్‌పై పెంచారు.. తర్వాతి బాదుడు పెట్రోల్, డీజిల్‌పైనే’’ అంటూ రాహుల్‌ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. వాణిజ్య సిలిండర్‌ ధరను పెంచడాన్ని పెట్రోలియంశాఖ సహాయ మంత్రి సురేష్‌ గోపి సమర్థించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తానికి, ప్రస్తుతం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులను బట్టి భవిష్యత్తు నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే

తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం

సిలిండర్ ‘డెలివరీ’ మాయాజాలం.. లక్షల్లో వసూళ్లు

రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు

గోళీలే ఆయుధాలు.. షాపింగ్‌ మాల్సే వారి టార్గెట్‌

Follow Us