మంచిర్యాల జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెన్నల మండలం కుష్నపల్లి అటవీ ప్రాంతంలోని కృష్ణపల్లి గ్రామంలో ఉన్న పోషమ్మ ఆలయం సమీపాన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. పెద్ద నారేప చెట్టు పక్కన రెండు మీటర్ల వెడల్పుతో మీటర్ లోతు వరకు గొయ్యి తవ్వారు దుండగులు. నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయలతో పూజలు చేశారు. గతంలోనూ ఇక్కడ తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లున్నాయని గ్రామ ప్రజలు చెబుతున్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడంతో.. ఒక్కసారిగా గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.