తాజ్ మహల్ వద్ద జాతీయ జెండా ఎందుకు ఎగురవేయరు..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఢిల్లీలోని ఎర్రకోట మొదలుకొని ప్రతి పల్లె, పట్టణంలోనూ త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతుంది. కానీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆగ్రా తాజ్ మహల్‌పై మాత్రం జాతీయ జెండా ఎగరడం ఎప్పుడైనా చూశారా? తాజాగా ఓ వ్యక్తి అక్కడ జెండా ఎగురవేయడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీని గురించి చట్టం ఏం చెప్తుందో తెలుసుకుందాం..

తాజ్ మహల్ వద్ద జాతీయ జెండా ఎందుకు ఎగురవేయరు..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..
Why Indian Flag Not Hoisted On Taj Mahal

Updated on: Aug 16, 2026 | 1:24 PM

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆగస్టు 15న ఓ వ్యక్తి తాజ్ మహల్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించగా, అక్కడి భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో అసలు దేశానికే గర్వకారణమైన తాజ్ మహల్‌పై జాతీయ జెండాను ఎందుకు ఎగురవేయరు? దీని వెనుక ఉన్న చట్టపరమైన కారణాలేంటి? అనే అంశంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఏఎస్ఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

భారత పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం.. దేశంలోని చారిత్రక కట్టడాలపై సాధారణ పౌరులు ఎలాంటి జెండాలు, రాజకీయ లేదా మతపరమైన జెండాలను ఎగురవేయడానికి అనుమతి లేదు. చారిత్రక, సాంస్కృతిక కట్టడాల పవిత్రతను, భద్రతను కాపాడేందుకు ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం, 1958 అమలులో ఉంది. కట్టడాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, పర్యాటకుల మధ్య విభేదాలు లేదా వివాదాలు సృష్టించే ఎలాంటి కార్యక్రమాలపైనా ఈ చట్టం కింద పూర్తి నిషేధం ఉంది.

ఎర్రకోటపై ఎగురవేస్తారు.. తాజ్ మహల్‌పై ఎందుకు కాదు?

చారిత్రక కట్టడాల స్వభావాన్ని బట్టి నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.

ఎర్రకోట: ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, సార్వభౌమాధికారానికి ప్రతీక. స్వాతంత్ర్య సంప్రదాయంలో భాగంగా ఏటా ప్రధాని ఇక్కడి నుంచే జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

తాజ్ మహల్: ఇది చారిత్రక సమాధి, అంతర్జాతీయ పర్యాటక కేంద్రం. దీనిని కేవలం రక్షిత స్మారక చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు తప్ప, ఎలాంటి రాజకీయ లేదా అధికారిక ప్రభుత్వ ఉత్సవాలకు వేదికగా ఉపయోగించరు. అందువల్ల ఇక్కడ అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ జెండా వందనం నిర్వహించరు.

నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు

చారిత్రక కట్టడాల ప్రాంగణాల్లోకి అక్రమంగా ప్రవేశించడం, బలవంతంగా జెండాలు ఎగురవేయడానికి యత్నించడం లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించడం నేరం. అలాంటి చర్యలకు పాల్పడేవారిపై ఏఎస్ఐ చట్టాలు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. నేరం రుజువైతే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us