
వందే భారత్ రైళ్లు విజయవంతం కావడంతో అదే జోష్ లో రైల్వే శాఖ త్వరలో వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనుంది. జులైలో కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా నడపనుంది. కలర్ లో తేడా తప్ప ఇవి చూసేందుకు అచ్చం వందే భారత్ లాగానే ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో చూసినట్లయితే.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు దూర ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని నగరాలకు ప్రయాణిస్తున్నాయి. కానీ వందే మెట్రోలు తక్కువ దూరానికి ఉద్దేశించినవి. అంటే సుమారు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల మధ్య షటిల్ సర్వీస్ లాగా రాకపోకలు సాగించనున్నాయి. అంటే ఇవి మినీ వందే భారత్ లు అన్నమాట. సమీప పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులు, చదువుకొనే విద్యార్థులకు వందే మెట్రోల వల్ల ఎక్కువగా లాభం జరగనుంది. దేశంలో సబర్బన్ రైలు ప్రయాణ అనుభూతిని మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ వీటిని ప్రవేశపెడుతోంది. 124 నగరాలు, పట్టణాల్లో వందే మెట్రోలను ప్రారంభించనుంది.
వందే భారత్ లాగానే వందే మెట్రోలలో కూడా కనీసం 12 కోచ్ లు ఉంటాయి. ప్రయాణికుల రద్దీని బట్టి 16 కోచ్ ల దాకా పెంచనున్నారు. సీట్ల సంఖ్యలో తేడా ఉండనుంది. వందే భారత్ ఎక్స్ప్రోస్లో అందరికీ సౌకర్యవంతమైన సీటింగ్ సదుపాయం ఉంది. అదే వందే మెట్రోలలో కేవలం 100 మంది కూర్చొనేందుకే సీట్లు ఉండనున్నాయి. మరో 180 మంది ప్రయాణికులు నిలబడేందుకు చోటు వుంటుంది. వందేభారత్ రైళ్లు చాలా వేగవంతమైనవి. గంటకు గరిష్ఠంగా 183 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. కానీ వందే మెట్రోలు కొంత తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకే వెళ్లగలవు. ఫ్రీక్వెన్సీ పరంగా చూస్తే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రోజుకు ఒకటి లేదా రెండు ట్రిప్పులు నడుస్తాయి. కానీ వందే మెట్రోలు షటిల్ సర్వీస్ లాగా రోజుకు నాలుగు లేదా ఐదు ట్రిప్పులు వేస్తాయి. వందే మెట్రోలను తిరుపతి–చెన్నై, ఢిల్లీ–రేవారి, ఆగ్రా–మథుర, లక్నో–కాన్పూర్ , భువనేశ్వర్–బాలాసోర్ మధ్య నడపనున్నారు.