టిప్ ఇస్తేనే రైడ్ వస్తుందా? కేంద్రం సీరియస్.. ఇక మీ ఆటలు సాగవు!
క్యాబ్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుల నుంచి ముందే వసూలు చేసే ‘అడ్వాన్స్ టిప్పింగ్’ ఫీచర్ను తక్షణమే నిలిపివేయాలని క్యాబ్, బైక్-టాక్సీ అగ్రిగేటర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా విధానాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో పాటు అనైతిక వ్యాపార పద్ధతుల కిందకు వస్తాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే స్పష్టం చేశారు.

ముందస్తు టిప్లపై నేషనల్ కన్ జ్యూమర్ హెల్ప్లైన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. టిప్ ఇస్తేనే రైడ్ దొరుకుతుందనేలా ప్రయాణికులను ఒత్తిడికి గురిచేయడం నిబంధనలకు విరుద్ధం. టిప్ ఇవ్వడం అనేది పూర్తిగా వినియోగదారుడి ఇష్టం, ప్రయాణం ముగిసిన తర్వాత నచ్చితేనే ఇచ్చే అంశమని సీసీపీఏ చీఫ్ నిధి ఖరే తెలిపారు.
ర్యాపిడోకు రూ. 10 లక్షల జరిమానా
ర్యాపిడో సేవలందిస్తున్న రోపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కు సీసీపీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. రైడ్ బుక్ అవుతుండగా యాప్లో ‘ధర ఎక్కువ ఉంటే రైడ్ దొరికే ఛాన్స్ ఎక్కువ’, ‘కెప్టెన్లు రూ. 60 వద్ద అంగీకరించడం లేదు, అదనంగా జోడించండి’ వంటి మెసేజ్లు చూపించడాన్ని సీసీపీఏ తప్పుబట్టింది. మొదట ఒక ఛార్జీ చూపించి, ఆ ధరకు డ్రైవర్లు రావడం లేదంటూ ఎక్కువ డబ్బులు అడగడం వినియోగదారుల్లో భయాన్ని సృష్టిస్తుందని, అది డార్క్ ప్యాటర్న్స్ కిందకు వస్తుందని తెలిపింది. దూరం, సమయం, ట్రాఫిక్ ఆధారంగా బుకింగ్ సమయంలోనే ఛార్జీ చూపిస్తారు కాబట్టి, ప్రయాణం మొదలుకాకముందే అదనంగా అడగడానికి ఎలాంటి సమర్థన లేదని స్పష్టం చేసింది.
ఉబర్, ఓలా సంస్థలు అనుసరిస్తున్న అడ్వాన్స్ టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై కూడా సీసీపీఏ విచారణ కొనసాగుతోంది. డార్క్ ప్యాటర్న్స్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇప్పటికే ఉబర్, ఓలా, ర్యాపిడో ప్లాట్ఫామ్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.