
రూ.156 ఆటో ఛార్జీకి బదులు రూ.15,682 డిజిటల్ పేమెంట్ చేసిన ఒక బిజీ కంపెనీ అధినేత, ఆ డబ్బులు తిరిగి రావేమోనని కంగారుపడ్డాడు. కానీ, ఆ ముంబై ఆటో డ్రైవర్ చూపిన అసాధారణ నిజాయితీ, మానవత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో కోట్ల మంది హృదయాలను గెలుచుకుంటోంది. ఈ హృదయాలను హత్తుకునే పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..
ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులు ఎంత సులువయ్యాయో, చిన్న పొరపాటు జరిగితే అంతటి భారీ నష్టాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనే ముంబై నగరంలో ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ శుభమ్ గునేకు ఎదురైంది. ఒక అంతర్జాతీయ క్లయింట్తో అత్యవసర సమావేశం ఉండటంతో ఆయన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. సమయం మించిపోతుండటంతో గబగబా ఆటో దిగి, మొబైల్ యాప్ ద్వారా ఆటో డ్రైవర్కు డబ్బులు చెల్లించాడు.
నిజానికి ఆటో ప్రయాణానికి అయిన ఖర్చు కేవలం రూ.156 మాత్రమే. కానీ, హడావిడిలో ఉన్న ఆయన స్క్రీన్ వైపు కూడా చూడకుండా పొరపాటున రూ.15,682 టైప్ చేసి ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఆ తర్వాత క్లయింట్తో జరిగిన మీటింగ్ కూడా ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో తీవ్ర నిరాశతో కిందకు వచ్చాడు. అప్పటివరకు తన అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు కట్ అయ్యాయనే విషయం కూడా ఆయన గమనించలేదు.
తన అకౌంట్ ఖాళీ అయిందని తెలుసుకున్న సదరు సీఈఓ, ముంబై లాంటి మహానగరంలో ఆ ఆటో డ్రైవర్ మళ్లీ దొరుకుతాడా? తన డబ్బులు తిరిగి వస్తాయా? అని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కానీ, కిందకు రాగానే ఆయనకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆటో డ్రైవర్ అల్తాఫ్ ఎక్కడికీ వెళ్లకుండా, సరిగ్గా ఆయనను ఎక్కడైతే దించాడో అదే స్థలంలో నిలబడి ఎదురుచూస్తున్నాడు.
శుభమ్ గునే దగ్గరకు రాగానే ఆటో డ్రైవర్ అల్తాఫ్ ఎంతో మర్యాదగా.. “సార్, మీరు నాకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ డబ్బులు పంపించారు” అని చెప్పాడు. అంతేకాదు, కేవలం అదనపు సొమ్ము మాత్రమే కాకుండా, మొత్తం రూ.15,682లను రూపాయి కూడా తగ్గకుండా వెంటనే వెనక్కి పంపించేశాడు.
ఆటో డ్రైవర్ నిజాయితీకి ముగ్ధుడైన సీఈఓ.. కనీసం నీకు రావాల్సిన రూ.156 ఛార్జీని ఉంచుకోమని, నాకోసం ఎదురుచూసి నీ విలువైన సమయాన్ని, ఇతర ప్రయాణాలను నష్టపోయావని ఎంత బతిమిలాడినా అల్తాఫ్ ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. “సార్, ఇది మన ఇద్దరికీ రోజు ప్రారంభం మాత్రమే. మీ మూడ్ బాగోలేదని నాకు అర్థమైంది, పర్లేదు” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత, ఆ రోజు ఫెయిల్ అయిందనుకున్న ఇంటర్నేషనల్ క్లయింట్ నుంచి శుభమ్కు ఫోన్ వచ్చింది. వారు ఆయనే ప్రాజెక్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ సంతోషకరమైన వార్త వినగానే శుభమ్కు మొదటగా గుర్తొచ్చింది ఆ ఆటో డ్రైవర్ అల్తాఫ్ మాత్రమే. తన చెడు సమయాన్ని మంచిగా మార్చిన ఆ డ్రైవర్కు కృతజ్ఞతగా రూ.500లను బహుమతిగా పంపించాడు.
ఈ స్టోరీని సదరు సీఈఓ లింక్డ్ఇన్ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. సమాజంలో ఇంకా మంచి తనం బతికే ఉందనడానికి అల్తాఫ్ లాంటి వ్యక్తులే నిదర్శనమని వేల మంది కామెంట్లు పెడుతున్నారు. వివాదాలతో నిండిపోయే సోషల్ మీడియాలో, ఇలాంటి నిజాయితీ కథనాలు మనుషులపై నమ్మకాన్ని పెంచుతున్నాయని నెటిజన్లు కొనియాడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..