
పశ్చిమ బెంగాల్, మార్చి 16: పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అన్నం బదులు పానీపూరీ (గోల్గప్పా)లు వడ్డించిన ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ వ్యవహారం కాస్తా నెట్టింట సంచలనంగా మారింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.
అయితే ఇటీవల కాలంలో కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా స్థానికంగా ఉన్న భద్రకాళి హైస్కూల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సాధారణంగా విద్యార్థులకు పాఠశాలలోనే గ్యాస్ ద్వారా వంట చేసి వడ్డిస్తుంటారు. అయితే ఎల్పీజీ కొరత తలెత్తడంతో సదరు బడిలో వంట చేసే పరిస్థితి కనిపించలేదు. దీంతో విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించడం వీలు కావడం లేదు. అయితే స్కూల్ టీచర్లు భోజనానికి బదులు విద్యార్ధులకు పానీపూరీలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలోను అక్కడి స్కూల్ అసిస్టెంట్ టీచర్ నందిక సర్కార్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఈ వీడియోలోవిద్యార్ధులు కంచాలు పట్టుకుని లైన్లో నిలబడి ఉండగా.. వారికి ఎదుట ఓ పానీ పూరీ బండి వ్యాపారి విద్యార్ధుల ప్లేట్లలో పానీ పూరీ వడ్డించడం చూడొచ్చు. ప్రతి విద్యార్ధికి 6-7 పానీ పూరీలు వడ్డిస్తున్నాడు.
ఇక వీడియో వైరల్ కావడంతో అయితే నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఆహారం అందించలేని సందర్భంలో పానీ పూరీ తినడంతో విద్యార్ధుల ముఖంలో సంతోషం కనిపిస్తుంది’, ‘పానీపూరీ ఆరోగ్యకరమైనది కాదు.. సాయంత్రం వేళల్లో దీనిని స్నాక్స్ తీసుకుంటే పర్వాలేదు’, ‘పానీ పూరీలు తింటే ఆకలి తీరదు కదా.. దీంతో విద్యార్ధులకు పోషకాలు అందవు’, ‘LPG గ్యాస్ అందుబాటులో లేనప్పుడు కట్టెలతో వంట చేయాలి కదా?’, ‘పిల్లలకు అనారోగ్యకరమైన ఆహారం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సిలిండర్లు అందించడం వారి పని కాదా?’ .. అంటూ నెటిజన్లు కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కాగా ఎల్పీజీ గ్యాస్ కొరత దేశ వ్యాప్తంగా సాధారణ జీవనంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన ఓ ఉదాహరణగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.