
సాధారణంగా దేవాలయాలకు వెళ్తే మన బాగుండాలని.. మన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక వింత ప్రదేశం ఉంది, అక్కడ ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని.. వారిని శపించాలని వెళ్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వింత సంప్రదాయం మన దేశంలో లేదు. ఐరోపా ఖండంలోని లిథువేనియా దేశంలో ఉంది. అక్కడ మ్యూజియం ఆఫ్ డెవిల్స్ అని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఉంది. ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన వేలాది దెయ్యాల విగ్రహాలు, భయంకరమైన ఆకృతులు ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో ఒక ప్రత్యేకమైన సేవ అందుబాటులో ఉంది. దీని ధర సుమారు 600 రూపాయలు. ఎవరైనా తమ శత్రువుల మీద కోపంతో ఉంటే ఈ మ్యూజియంలోని ఒక ప్రత్యేక విభాగంలో వారి పేరును నమోదు చేసి, వారికి కీడు జరగాలని శాపనార్థాలు పెట్టవచ్చు. అక్కడ ఒక పురాతనమైన నమ్మకం ప్రకారం.. ఈ మ్యూజియంలోని కొన్ని విగ్రహాల ముందు శత్రువుల పేర్లు రాసి పెడితే వారికి దురదృష్టం వెన్నాడుతుందని అక్కడి వారు నమ్ముతుంటారు. ఇది కేవలం ఒక మూఢనమ్మకమని కొందరు కొట్టిపారేసినా.. వినోదం కోసం మరియు ఆ వింత అనుభూతిని పొందడం కోసం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
ఈ మ్యూజియంలో దాదాపు 3,000 పైగా దెయ్యాలు, భూతాల విగ్రహాలు ఉన్నాయి. కళాకారుడు ఆంటానాస్ జ్ముయిడ్జినావిసియస్ ఈ సేకరణను ప్రారంభించారు. కేవలం శపించడమే కాకుండా వివిధ దేశాల సంస్కృతుల్లో దెయ్యాలను ఎలా చూస్తారో ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి పగలు తీర్చుకోవడానికి కత్తులు, గొడ్డళ్లు అక్కర్లేదు.. జస్ట్ 600 రూపాయలు ఉంటే చాలు అన్నట్లుగా తయారైంది ఈ మ్యూజియం పరిస్థితి.