
దుబాయ్లో నివసిస్తున్న కేరళకు చెందిన 27 ఏళ్ల ఆయేషా అమీర్ అనే భారతీయ మహిళను అదృష్టం ఊహించని విధంగా వరించింది. దుబాయ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక షాపింగ్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె, పూర్తి ఉచితంగా ఒక లగ్జరీ స్టూడియో అపార్ట్మెంట్ను గెలుచుకుంది. ఒక ప్రచార డ్రాలో ఉచితంగా స్టూడియో అపార్ట్మెంట్ గెలుచుకున్నట్లు వార్త అందినప్పుడు మొదట, ఆమె ఆ కాల్ ఒక మోసం అని భావించింది. కానీ, నిజం బయటపడగానే ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది.
దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ (DFRE), దుబాయ్ ఛాంబర్స్ సంయుక్తంగా విన్ యువర్ హోమ్ ఇన్ దుబాయ్ (Win Your Home in Dubai) అనే ఒక సిటీ-వైడ్ షాపింగ్ ప్రమోషన్ను ప్రారంభించాయి. దీని ప్రకారం, ఎవరైనా భాగస్వామ్య అవుట్లెట్లలో కనీసం 500 దిర్హామ్లు (దాదాపు రూ.13,000) విలువైన షాపింగ్ చేసి, అక్కడ లభించే QR కోడ్ను స్కాన్ చేసి బిల్లును అప్లోడ్ చేస్తే చాలు, వారు లక్కీ డ్రాకు అర్హత సాధిస్తారు. లగ్జరీ ప్రాపర్టీ డెవలపర్ బింఘట్టి (Binghatti) ఈ ప్రమోషన్లో భాగంగా ఉచిత అపార్ట్మెంట్లను అందిస్తోంది.
దుబాయ్లో బిజినెస్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న 27 ఏళ్ల ఆయేషా అమీర్, తన భర్తతో కలిసి మాల్కు వెళ్లినప్పుడు ఈ పోటీ గురించి తెలుసుకుంది. భర్త ప్రోత్సాహంతో కేవలం 500 దిర్హామ్ల షాపింగ్ బిల్లుతో ఆమె డ్రాలో రిజిస్టర్ చేసుకుంది. అదృష్టవశాత్తూ, ఈ భారీ ప్రమోషన్లో ఎంపికైన అత్యంత మొదటి వారపు విజేతగా ఆయేషా నిలిచింది. ఆమెకు ఒక విలాసవంతమైన స్టూడియో అపార్ట్మెంట్ బహుమతిగా లభించింది.
విజేతగా నిలిచిన తర్వాత ఆయేషాకు నిర్వాహకుల నుండి ఫోన్ కాల్ వచ్చింది. అయితే, ఈ రోజుల్లో లాటరీల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు (Scams) ఎక్కువగా ఉండటంతో, ఆమె ఆ కాల్ను నమ్మలేదు. ఎవరో తనను మోసం చేయడానికి ఫేక్ కాల్ చేస్తున్నారని భావించింది. కానీ, ఆ తర్వాత పూర్తి వివరాలు, అధికారిక డాక్యుమెంట్లతో కూడిన కన్ఫర్మేషన్ ఈమెయిల్ రావడంతో ఆమెకు అసలు నిజం బోధపడింది.
గతేడాదే వివాహం చేసుకున్న ఆయేషా దంపతులు ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్లో ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేశారు. అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆ ప్లాన్ను వాయిదా వేసుకున్నారు. అలాంటి తరుణంలో ఈ లక్కీ డ్రా రూపంలో ఉచిత ఇల్లు లభించడం దేవుడిచ్చిన వరమని, దుబాయ్ నగరం తమకు మరపురాని జీవితాన్ని ప్రసాదించిందని ఈ దంపతులు ఉప్పొంగిన ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..