
ఇన్సురెన్స్ డబ్బుల కోసం కర్నాటక హోస్పేట్కు చెందిన వ్యక్తిని హత్య చేసి ప్రమాదంలా చిత్రీకరించేయత్నం చేసిన ఆరుగురు పోలీసులకు చిక్కారు. కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ కథను తలపించే ఈ సంఘటన విజయనగర జిల్లాలో కలకలం రేపింది. సెప్టెంబర్ 28న హోస్పేట్ శివారులో గంగాధర అనే వ్యక్తి మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించినట్లు కేసు నమోదు అయింది. అయితే అతనికి పక్షవాతం ఉండి బైక్ నడిపే స్థితిలో లేడని భార్య అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించారు.
చివరికి గంగావతి ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కృష్ణప్పే ఈ పథకానికి మాస్టర్మైండ్ అని బయటపడింది. ఆయనతో పాటు ఒక బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్, గోసంగి రవి, అజయ్, రియాజ్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పక్షవాతం బాధితుడైన గంగాధరపై రూ.5 కోట్ల జీవిత బీమా, రూ.25 లక్షల ప్రమాద బీమా చేయించి, నకిలీ భార్య పేరుతో నామినీ ఏర్పాటు చేశారు.
సహజ మరణం కోసం ఎదురుచూడలేక సెప్టెంబర్ 28న గంగాధరను కిడ్నాప్ చేసి, హత్య చేసి ప్రమాదంలా సెట్ చేశారు. అయితే మృతుడి భార్య అనుమానం, మొబైల్ డేటా ఆధారాలతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు.