
భారతీయ రైల్వేను ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైలు నెట్వర్క్ అని ఊరికే అనరు. ఇది ఎన్నో రికార్డులు, అద్భుతాలను కలిగి ఉంది. అలాంటి ఒక అపురూపమైన ఆణిముత్యమే హిమసాగర్ ఎక్స్ప్రెస్. ఇది దేశంలో ఉత్తరాన్ని దక్షిణంతో నేరుగా కలిపే ఏకైక రైలు. మాతా వైష్ణో దేవి కత్రా నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇది నేరుగా కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. తన ప్రయాణంలో, ఇది మొత్తం 3,790 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ దూరం అత్యంత అనుభవజ్ఞులైన ప్రయాణికులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రయాణికులకు అస్సలు బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ రైలు భారతదేశంలోని 12 రాష్ట్రాల గుండా సాగుతుంది. జమ్మూ-కశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఇది కవర్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా ఈ రైలు వెళ్తుంది.
హిమసాగర్ ఎక్స్ప్రెస్ తన మార్గంలో 69 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ప్రతి స్టాప్లోనూ ప్రయాణికులకు సరికొత్త భాష, విభిన్నమైన సంస్కృతి, స్థానిక రుచులు పరిచయమవుతాయి. పంజాబీ పరాటాల నుండి దక్షిణాది ఇడ్లీ, సాంబార్, కొబ్బరి నీళ్ల వరకు ఎన్నో రకాల ఆహారాలను ఈ ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.
భారతదేశంలోని వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలనుకునే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ట్రావెల్ లవర్స్ తమ జీవితంలో ఒక్కసారైనా హిమసాగర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాలి. ఇది కేవలం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లే సాధనం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప అనుభూతి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..