
వైద్య చరిత్రలో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రి అరుదైన మైలురాయిని అధిగమించింది. అద్దంలో చూస్తే అవయవాలు ఎలా కనిపిస్తాయో, అలాగే శరీరంలోని అన్ని అవయవాలు రివర్స్లో ఉన్న ఒక మహిళకు అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి వైద్యులు అందరినీ ఆశ్చర్యపరిచారు. సహజంగా గుండె ఎడమ వైపున ఉంటుంది. కానీ ఈ మహిళకు అది కుడి వైపున ఉంది. దీనిని వైద్య పరిభాషలో సైటస్ ఇన్వర్సస్ అంటారు. కేవలం అవయవాలు మారి ఉండటమే కాకుండా, ఆమె గుండె గదుల మధ్య రంధ్రం ఉండటం వల్ల ఆక్సిజన్ లేని రక్తం, ఆక్సిజన్ ఉన్న రక్తం కలిసిపోయి ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడింది.
రాజస్థాన్కు చెందిన 31 ఏళ్ల మహిళా రోగికి సైటస్ ఇన్వర్సస్ (Situs Inversus) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన స్థితి ఉంది. ఈ స్థితిలో శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ సాధారణ స్థితికి విరుద్ధంగా (Mirror Image) ఉంటాయి. అంటే ఆమెకు గుండె కుడి వైపున, లివర్ ఎడమ వైపున ఉన్నాయి. దీనికి తోడు ఆమె గుండెలో రంధ్రం (Partial AV Canal Defect) ఉండటంతో రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడ్డాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఛాతీ ఎముకను పూర్తిగా కోసి (Open Heart Surgery) ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ RML వైద్య బృందం ఎటువంటి ఎముకను కోయకుండా, కేవలం 4 సెంటీమీటర్ల చిన్న కోత ద్వారా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను పూర్తి చేశారు.
ప్రపంచంలోనే మొదటిసారిగా (Global First): CTVS విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర సింగ్ ఝఝ్రియా నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఛాతీ ఎముకను కట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రోగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. పెద్ద మచ్చ మిగిలిపోతుంది. కానీ, వైద్యులు కేవలం 4 సెంటీమీటర్ల చిన్న కాస్మెటిక్ ఇన్సిషన్ ద్వారా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ (MICS) చేశారు. ఇలాంటి అరుదైన స్థితి ఉన్న రోగికి చిన్న కోతతో ఆపరేషన్ చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని ఆసుపత్రి పేర్కొంది. శస్త్రచికిత్స విశేషాలను కూడా వెల్లడించారు వైద్య బృందం.
వైద్యుల ప్రకారం.. ఆపరేషన్ సమయంలో రోగిని హార్ట్-లంగ్ మెషీన్పై ఉంచి రక్తప్రసరణను కొనసాగించారు. గుండె రంధ్రాన్ని పూడ్చడానికి రోగి సొంత గుండె పొర (Pericardium) నుండి తీసిన ముక్కను వాడారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఈ ఖరీదైన చికిత్సను పేద రోగికి ఉచితంగా అందించారు. మార్చి 30వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. మూడు రోజుల్లోనే రోగి పరిస్థితి మెరుగుపడింది. ఆమెను కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న రోగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. భారతీయ వైద్యుల ప్రతిభకు, ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతకు ఈ విజయం ఒక నిదర్శనంగా పలువురు ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..